సినిమా: ఆయనతో నటించాలనుంది అంటోంది నటి రాశీఖన్నా. టాలీవుడ్ నుంచి కోలీవుడ్కు వచ్చిన ఈ హైదరాబాద్ బ్యూటీ ఇక్కడ ఒక రౌండ్ కొట్టేలాఉంది. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్లో కంటే కోలీవుడ్పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లుంది. దానికి కారణం లేకపోలేదు. తమిళంలో రాశీఖన్నాకు రాశి బాగున్నట్లే ఉంది. తమిళంలో ఈ అమ్మడు నటించిన రెండు చిత్రాలు సక్సెస్ సాధించాయి.అంతే కాకుండా వరుసగా స్టార్స్తో నటించేస్తోంది. తొలి చిత్రంలోనే నయనతార, విజయ్సేతుపతి, అధర్వ వంటి స్టార్స్తో నటించే అవకాశం వరించడం, ఆ చిత్రం సక్సెస్ కావడంతో రాశీఖన్నా పేరు పాపులర్ అయింది. ఇక హీరోయిన్ల రాశి హీరో అయిన జయరంరవితో కలిసి అడంగుమరు చిత్రంలో రొమాన్స్ చేసేసింది. ఈ చిత్రం విజయాన్ని అందించింది. దీంతో రాశీఖన్నా కూడా రాశి గల నటిగా ముద్ర వేసుకుంది. ఈ సందర్భంగా ఇటీవల చెన్నైకి వచ్చిన రాశీఖన్నా పత్రికలవారికిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంటూ తన శరీర అందాలంటే చాలా ఇష్టమని చెప్పింది. అందుకే ఎప్పుడూ తన శరీరాన్ని అందంగానూ, ఆరోగ్యంగానూ ఉండేలా కాపాడుకుంటానని అంది. అందుకు ప్రతిరోజూ గంటన్నరకు తగ్గకుండా వ్యాయామం చేస్తానని చెప్పింది.
ఇక ఆహార విషయానికి వస్తే కారం, మసాలా పదార్థాలు అసలు ఇష్టం ఉండదని, అదేవిధంగా మితిమీరి భుజించడం నచ్చదని చెప్పింది. ఇకపోతే నలుపు–తెలుపు రంగులు చాలా మందికి నచ్చవని, అయితే అవి నాకు చాలా ఇష్టం అని అంది. ఇంకా కవితలు రాయడం ఇష్టమని, చాలా కవితలు రాశానని చెప్పింది. అయితే వాటిని ఎవరికీ వినిపించనని అంది. తనకు బైక్, కారు ప్రయాణం అంటే చాలా ఇష్టమని, అలా చాలా దూరం పయనించడం ఇంకా ఇష్టం అని చెప్పింది. ఇమైకానోడిగళ్ చిత్రంలో నటించినా, నయనతార, విజయ్సేతుపతిలతో కలిసి నటించే అవకాశం లేకపోవడం బాధాకరమేనంది. విక్రమ్ వేదా చిత్రం చూసినప్పటిì నుంచి విజయ్సేతుపతికి జంటగా నటించాలని కలలు కంటున్నట్లు చెప్పింది. ఇక నటుడు విజయ్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో రూపొందిన తెరి, మెర్శల్ చిత్రాలను చూశానని, వారి కాంబినేషన్ అంటేనే యమ క్రేజ్ అని పేర్కొంది. ఆ కాంబినేషన్లో నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నానని రాశీఖన్నా చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ విశాల్కు జంటగా అయోగ్య, సిద్ధార్థ్తో సైతాన్ కా బచ్చా చిత్రాల్లో నటిస్తోంది.