అలాంటి చిత్రాలు ఇష్టమే కానీ..

7 Feb, 2020 11:54 IST|Sakshi

సినిమా: యాక్షన్‌ కథా చిత్రాల్లో నటించడం ఇష్టమే కానీ అంటోంది నటి రితికాసింగ్‌. రియల్‌ బాక్సర్‌ అయిన ఈ ఉత్తరాది బ్యూటీ రీల్‌ హీరోయిన్‌గా మారి ఇరుదు చుట్రు చిత్రంతో దక్షిణాదికి పరిచయమైంది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు రితికాసింగ్‌కు మంచి పేరును తెచ్చి పెట్టింది. ఇరుదుచుట్రు తెలుగు రీమేక్‌ గురు చిత్రంలోనూ ఈ అమ్మడే నటించింది. ఆ తరువాత లారెన్స్‌తో శివలింగ, విజయ్‌సేతుపతికి జంటగా ఆండవన్‌ కట్టళై వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించింది. అయినా ఎందుకనో ఆ తరువాత కోలీవుడ్‌కు దూరమైంది. అలాంటిది ఇప్పుడు కోలీవుడ్‌లో రెండు చిత్రాల్లో నటిస్తోంది. వాటిలో ఒకటి ఓ మై కడవులే. అశోక్‌సెల్వన్‌తో జతకట్టిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 14వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా నటి రితికాసింగ్‌ను ఇటీవల సాక్షి పలకరించింది  ఓ మై కడవులే చిత్రంలో నటించిన అనుభవం గురించి చెప్పమనగా దర్శకుడు చెప్పిన కథ నచ్చింది.

వెంటనే నటించడానికి అంగీకరించాను, నటుడు అశోక్‌సెల్వన్‌ చిత్ర యూనిట్‌ ఎంతగానో సహకరించారు. ఇందులో నటుడు విజయ్‌సేతుపతి ముఖ్య పాత్రలో నటించారు. ఆయన చాలా స్వీట్‌ పర్సన్, ఇది చాలా రొమాంటిక్‌ ప్రేమ కథా చిత్రం. కోలీవుడ్‌లో కనిపించి చాలా కాలమైంది. ఈ గ్యాప్‌నకు కారణం ఏమిటన్న ప్రశ్నకు నిజం చెప్పాలంటే చాలా అవకాశాలు వస్తున్నాయని, అయితే అన్నీ అంగీకరించడం లేదని చెప్పింది.  మంచి కథ అనిపిస్తేనే నటించడానికి ఒప్పుకుంటున్నానని చెప్పింది. తనకు కథ నచ్చాలని చెప్పింది. ఇరుదుచుట్రు లాంటి యాక్షన్‌ కథా చిత్రాల్లో నటిస్తారా? అన్న ప్రశ్నకు ఇప్పట్లో అలాంటి చిత్రాలు చేయనని అంది. ప్రస్తుతానికి ప్రేమ కథా చిత్రాల్లోనే నటించాలని అనుకుంటున్నట్లు చెప్పింది. మళ్లీ బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు తాను బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ను చేస్తూనే ఉన్నానని, అయితే ప్రస్తుతం చిత్రాలపైనే దృష్టి సారిస్తున్నట్లు రితికాసింగ్‌ చెప్పింది. ఈ అమ్మడు ఇప్పుడు చాలా గ్లామరస్‌గా మారిపోయింది. గ్లామర్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో  విడుదల చేసి వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ అరుణ్‌ విజయ్‌తో బాక్సర్‌ చిత్రంలో నటిస్తోంది.

మరిన్ని వార్తలు