ప్రియాంకపై మండిపడ్డ సల్మాన్‌

4 May, 2019 15:23 IST|Sakshi

అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో ప్రతిష్టత్మాకంగా తెరకెక్కుతున్న భారత్‌ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన చిత్ర ట్రైలర్‌ సినిమాపై అంచనాలను ఓ రేంజ్‌కు తీసుకెళ్లింది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు చిత్రబృందం. దీనిలో భాగంగా శుక్రవారం సోషల్‌ మీడియాలో లైవ్‌ చాట్‌ నిర్వహించారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సల్మాన్‌, కత్రినా, దర్శకుడు అలీ సమాధానమిచ్చారు. ఓ అభిమాని ప్రియాంక గురించి ప్రశ్నించేందుకు ప్రయత్నించాడు. కానీ సల్మాన్‌ అతన్ని అడ్డుకుని ‘ప్రియాంక మాకు ఎక్కువ సమయం ఇవ్వలేదు. చాలా ఇబ్బంది పడ్డాం’ అని సమాధానమిచ్చారు.

మరో అభిమాని ఒకరు ‘ఈ సినిమాలో మీ పాత్రకు తగ్గట్టుగా మారడం కోసం ఎంత సమయం తీసుకున్నార’ని కత్రినాను ప్రశ్నించారు. అందుకు ఆమె ‘ఈ పాత్ర కోసం నేను రెండు నెలల పాటు కష్టపడ్డాను. సినిమాలో నా పాత్ర 1975 నుంచి 1990 వరకూ ఆ తర్వాత 2010లో కనిపిస్తుంది. ఆయా కాలాలకు తగ్గట్టుగా నా పాత్రలో మార్పులు కన్పిస్తాయ’ని తెలిపారు. అంతేకాక వృద్ధురాలి పాత్రలో నటించడం తనకు కాస్త కష్టమైందన్నారు కత్రినా. ఆ వయసు వారి బాడీ లాంగ్వేజ్‌..  మైండ్‌ సెట్‌ ఎలా ఉంటుందో తెలుసుకుని.. అలా నటించడానికి కష్టపడాల్సి వచ్చిందన్నారు కత్రినా.

2014లో వచ్చిన కొరియన్‌ హిట్‌ మూవీ ‘యాన్‌ ఓడ్‌ టు మై ఫాదర్‌’కి ‘భారత్‌’ హిందీ రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈ ఏడాది రంజాన్‌ సందర్భంగా ప్రేక్షకులు ముందుకు వస్తోంది. అయితే తొలుత ఈ చిత్రంలో ప్రియాంకను హీరోయిన్‌గా తీసుకున్నారు. కానీ నిక్‌ జోనాస్‌తో వివాహం, హాలీవుడ్‌ ప్రాజెక్స్‌కి సైన్‌ చేయడంతో ప్రియాంక ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. దాంతో ప్రియాంక ప్లేస్‌లో కత్రినాను తీసుకున్నారు.

మరిన్ని వార్తలు