శ్రద్ధా ఫెయిల్‌.. ఆ చిత్రం ఆగిపోయింది!

8 Jan, 2018 10:07 IST|Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌కు గత కొంత కాలంగా సక్సెస్‌ రేటు లేకుండా పోయింది. ఓకే జానుతోపాటు భారీ అంచనాల నడుమ విడుదలైన హసీనా పార్కర్‌ కూడా ఆమెకు హిట్‌ను అందించలేకపోయాయి. అయినప్పటికీ చేతిలో క్రేజీ ప్రాజెక్టులతో ఆమె కెరీర్‌ దూసుకుపోతోంది. ప్రస్తుతం శ్రద్ధా ప్రభాస్‌ సాహో షూటింగ్‌లో పాల్గొంటూనే.. మరోపక్క సైనా నెహ్వాల్‌ బయోపిక్‌కు సన్నద్ధమవుతోంది. 

అయితే అనూహ్యంగా సైనా బయోపిక్‌ రద్దైనట్లుగా బాలీవుడ్‌ మీడియాలో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. బ్యాడ్మింటన్‌ నేపథ్యం కావటంతో గత కొన్ని రోజులుగా సైనా, గోపీచంద్‌ల సమక్షంలో శ్రద్ధా ఆటను సాధన చేస్తున్న విషయం తెలిసిందే. కానీ, ఆమె ఆటలో పరిపూర్ణత సాధించలేకపోవటంతో ఈ బయోపిక్‌ యత్నాన్ని దర్శకుడు అమోల్‌ గుప్తే విరమించుకున్నాడని ప్రముఖ మీడియా సంస్థ మింట్‌ కథనం ప్రచురించింది.

అయితే ఆ వార్తలను చిత్ర యూనిట్‌ ఖండించినట్లు మరో కథనం వెలువడింది. శ్రద్ధా సాధన కోసం మరింత సమయం తీసుకోవాలని భావిస్తోందని.. అమోల్‌ కూడా అందుకు అంగీకరించటంతో కాస్త ఆలస్యంగా చిత్ర షూటింగ్‌ ప్రారంభం అవుతుందని ఆ కథనం పేర్కొంది. ఇక మరో కథనం అయితే ఏకంగా శ్రద్ధాను తప్పించి.. ఆ స్థానంలో బ్యాడ్మింటన్‌ ఆటలో ప్రావీణ్యం ఉన్న దీపిక పదుకునేను తీసుకోవాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వార్తను ప్రచురించింది. ఏది ఏమైనా మేకర్లు, చిత్ర యూనిట్‌ అధికారికంగా స్పందిస్తేనే ఈ పుకార్లపై స్పష్టత వచ్చేది.

మరిన్ని వార్తలు