తల్వార్లతో విన్యాసాలు.. మెడతెగి మైనర్‌ మృతి

8 Jan, 2018 10:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పెండ్లి బరాత్‌లో తల్వార్లతో విన్యాసాలు (మర్ఫా డాన్స్‌) చేసిన మైనర్లు.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారు. హైదరాబాద్‌లోని షేక్‌పేటలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనలో పోలీసులు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.

స్నేహితులు పిలిస్తే వెళ్లి.. : షేక్‌పేటకు చెందిన సయ్యద్‌ హమీద్‌ స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. స్నేహితులు పిలవడంతో మూడురోజుల కిందట అతను ఓ పెండ్లి బరాత్‌కు వెళ్లి డాన్స​ చేశాడు. అక్కడ కొందరు మైనర్లు.. అనుభవం లేకున్నా కత్తులు, తల్వార్లతో విన్యాసాలు చేశారు. ఆ క్రమంలోనే దూసుకొచ్చిన తల్వార​ హమీద్‌ మెడకు తగిలింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అతను కుప్పకూలిపోయాడు. అనంతరం ఆ బాలుడిని దారుసలాంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం అతను ప్రాణాలు విడిచారు.

పోలీసుల అదుపులో 10 మంది : ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనలో బాధితుడి తల్లి ఫిర్యాదుమేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదుచేశారు. దర్యాప్తులో భాగంగా బరాత్‌లో తల్వార్లతో విన్యాసాలు చేసిన 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. చేతికొచ్చిన కొడుకు చనిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోన్న తల్లి.. వేడుకల్లో ఆయుధాలతో విన్యాసాలు వద్దని పిలుపునిస్తున్నారు.

మరిన్ని వార్తలు