నేను అందగత్తెను కాను!

26 Jul, 2019 07:34 IST|Sakshi

తమిళసినిమా: నేను అందగత్తెను కాను అంటోంది నటి శ్రద్ధాశ్రీనాథ్‌. ఈ కన్నడ నటి మాతృభాషలో నటించిన యూటర్న్‌ చిత్రంతో వెలుగులోకి వచ్చింది. కోలీవుడ్‌లో ఇవన్‌ తందిరన్‌ చిత్రంతో రంగప్రవేశం చేసి విక్రమ్‌ వేదా చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరువాత జెర్సీ చిత్రంతో టాలీవుడ్‌లోనూ సక్సెస్‌ను అందుకున్న శ్రద్ధాశ్రీనాథ్‌ నటనకు అవకాశం ఉన్న మంచి పాత్రలే వస్తున్నాయని చెప్పవచ్చు. తాజాగా అజిత్‌ కథానాయకిగా నటించిన నేక్కొండ పార్వై చిత్రంలో ప్రధాన పాత్రను పోషించింది. ఇది బాలీవుడ్‌ హిట్‌ చిత్రం పింక్‌కు రీమేక్‌. హిందీలో నటి తాప్సీ నటించిన పాత్రను తమిళంలో శ్రద్ధాశ్రీనాథ్‌ పోషించింది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్‌ నెల ద్వితీయార్థంలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ప్రస్తుతం కన్నడంలో ఒక చిత్రం తెలుగులో జోడి అనే చిత్రంలో నటిస్తోంది.  సాధారణంగా ఆమె స్థాయిలో ఉన్న ఏ నటి అయినా కథానాయకిగా మరింత పేరు తెచ్చుకోవాలని ఆశిస్తుంది.

అలాంటిది కథానాయకిగా నటిస్తున్న శ్రద్ధాశ్రీనాథ్‌ మాత్రం తాను కథానాయకిని కాదు నటినే అంటోంది. అదేంటని అడిగితే  కథానాయకుడు, కథానాయకి అన్న పదాల్లో నటుడు, నటి అనే పేర్లు ప్రతిధ్యనించడం లేదని అంది.  ఇకపోతే  కథానాయకుడు అనగానే పలువురిని చితకబాదాలని అంది. ఇక కథానాయకి అంటే అందంగానూ, గ్లామర్‌ గానూ ఉండాలంది. తాను అలా లేనని చెప్పింది. తానిప్పుడు కథానయకి పేరుతో నటిస్తున్నానని, తాను నటినేనని శ్రద్ధాశ్రీనాథ్‌ పేర్కొంది. నేర్కొండ పార్వై చిత్రంలో అజిత్‌తో నటించిన అనుభవం గురించి తెలుపుతూ తాను తొలి రోజు షూటింగ్‌కు కారులో వెళ్లానని, కారు షూటింగ్‌ స్పాట్‌ దగ్గరకు వెళుతుండగా దూరంలో అజిత్‌ తొలిసారిగా చూశానని చెప్పింది. పెద్ద స్టార్‌. ఆయనతో ఎలా మాట్లాడాలి, నటించాలి అని సంకోచంతోనే కారు దిగానని చెప్పింది. అప్పుడు ఆయన షేక్‌హ్యాండ్‌ ఇచ్చి విక్రమ్‌ వేదా చిత్రంలో మిమ్మల్ని చూశాను అని అన్నారంది. ఆయన గురించి పెద్ద స్టార్, తల అని ఊహించుకున్న ఇమేజ్‌ అయన ప్రవర్తనతో పటాపంచలైందని చెప్పింది. అసలు ఆయన స్టార్‌ నటుడిగానే నడుచుకోలేదని, చాలా నిడారంబరంగా ఉన్నారంది. ఏదైన  చెబితే స్వాగతించేవారని, సాయం చేయడానికి ఎప్పుడూ వెనుకాడలేదంది. కొన్ని పెద్ద సన్నివేశాల్లో నటించడానికి ఎక్కువ టేక్‌లు తీసుకుంటే సెట్‌లో ఉన్న వారందరికీ సారీ చెప్పేవారని, ఆయన ఉన్నతమైన నటుడని పేర్కొంది.

మరిన్ని వార్తలు