మళ్లీ బిజీ అవుతున్న సిద్ధార్థ్‌

1 Aug, 2019 07:52 IST|Sakshi

చెన్నై : సినిమా ఎవరిని ఎప్పుడు ఏ స్థాయిలో నిలబెడుతుందో చెప్పడం కష్టం. సహాయ దర్శకుడిగా సినీరంగప్రవేశం చేసి ఆ తరువాత బాయ్స్‌ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన నటుడు సిద్ధార్థ్‌. ఆ తరువాత తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చి రెండు భాషల్లోనూ పేరు తెచ్చుకున్నాడు. అలాంటిది సడన్‌గా సిద్ధార్థ్‌కు సినిమాలు తగ్గాయి. దీంతో నిర్మాతగా మారి అవళ్‌ అనే హర్రర్‌ చిత్రంలో నటించి నిర్మించి సక్సెస్‌ అయ్యాడు. అయితే ఆ తరువాత మరో చిత్రంలో ఆయన్ని తెరపై చూడలేదు. ఇటీవల ది లైన్‌ కింగ్‌ ఆంగ్ల చిత్రం తమిళ అనువాదానికి డబ్బింగ్‌ చెప్పి వార్తల్లోకి వచ్చాడు. ఇక నటుడిగా ఇప్పుడు కోలీవుడ్‌లో మళ్లీ బిజీ అయిపోయారు. ఇప్పటికే శశి దర్శకత్వంలో శివప్పు మంజల్‌ పచ్చై చిత్రంతో పాటు నవ దర్శకుడు సాయి శంకర్‌ దర్శకత్వంలో అరువం అనే చిత్రంలోనూ నటిస్తున్నాడు.

త్వరలో మణిరత్నం పొన్నియన్‌ సెల్వన్, కమలహాసన్‌ హీరోగా నటించనున్న ఇండియన్‌–2 చిత్రంలోనూ నటించనున్నాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్‌ ఆలస్యం అయ్యేలా ఉండడంతో తాజాగా దర్శకుడు రామ్‌తో కలిసి ఒక చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడన్నది టాక్‌. రామ్‌ ఇంతకు ముందు కట్రదు తమిళ్, తంగమీన్‌గళ్, తరమణి వంటి వైవిధ్యభరిత కథా చిత్రాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. కాగా నటుడు సిద్ధార్థ్‌ కోసం ఈయన మంచి కథను తయారు చేసినట్లు సమాచారం. నటుడు సిద్ధార్థ్‌ కూడా నటించడానికి సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు, నిర్మాత సెట్‌ కాగానే షూటింగ్‌కు రెడీ అవడమేనని తెలిసింది. అంతే కాకుండా దీన్ని నటుడు సిద్ధార్థ్‌నే నిర్మించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం తమిళ జాతి, భాష కోసం పోరాడే ఒక యువకుడి ఇదివృత్తంతో కూడిన కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరిన్ని వార్తలు