సుకుమార్ ఫ్యామిలీ నుంచి మరో బ్యానర్

3 Jun, 2016 09:00 IST|Sakshi
సుకుమార్ ఫ్యామిలీ నుంచి మరో బ్యానర్

మూస మాస్ సినిమాల టైంలో కొత్త తరహా చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు సుకుమార్. తన ప్రతి కథలోనూ సైన్స్కు కీలక పాత్ర కల్పించే ఈ లెక్కల మాస్టరు, నిర్మాతగానూ మంచి విజయం సాధించాడు. సుకుమార్ రైటింగ్స్ పేరుతో బ్యానర్ను స్థాపించి తొలి ప్రయత్నంగా కుమారి 21ఎఫ్ సినిమాను తెరకెక్కించాడు. సుక్కు స్వయంగా కథా కథనాలు అందించిన ఈ సినిమా ఘన విజయం సాధించటంతో నిర్మాతగానూ కొనసాగాలని నిర్ణయించుకున్నాడు.

అయితే సుకుమార్ నిర్మాతగా తన రెండో సినిమా కోసం మరో బ్యానర్ను స్థాపిస్తున్నాడు. తన తండ్రి పేరుతో బీటీఆర్ క్రియేషన్స్ స్థాపించిన ఆ బ్యానర్పై తన అన్న కొడుకు అశోక్ను హీరోగా పరిచయం చేయబోతున్నాడు. ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయిన ఈ సినిమాకు దర్శకుడు అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన హరిప్రసాద్, ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఈ నెల 9 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.