భారత అమెరికన్లకు అత్యున్నత పురస్కారాలు

26 Oct, 2023 06:14 IST|Sakshi

బైడెన్‌ చేతుల మీదుగా అందుకున్న గాడ్గిల్, సురేశ్‌  

వాషింగ్టన్‌:  భారతీయ అమెరికన్‌ శాస్త్రవేత్తలు అశోక్‌ గాడ్గిల్, సుబ్రా సురేశ్‌ అమెరికా అత్యున్నత శాస్త్ర సాంకేతిక రంగ అవార్డులు అందుకున్నారు. గాడ్గిల్‌కు వైట్‌ హౌస్‌ నేషనల్‌ మెడల్‌ ఫర్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్నొవేషన్, సురేశ్‌కు నేషనల్‌ మెడల్‌ ఆఫ్‌ సైన్స్‌ అవార్డులు దక్కాయి.

అధ్యక్షుడు జో బైడెన్‌ వారికి ఈ ప్రతిష్టాత్మక అవార్డులతో అందజేశారు. మానవ జీవితాన్ని సుఖవంతం చేసే పలు అమూల్య పరికరాలను కనిపెట్టిన ఘనత గాడ్గిల్‌ది అంటూ కొనియాడారు. ఇక మెటీరియల్‌ సైన్స్, ఇతర రంగాల్లో దాని వాడకాన్ని సురేశ్‌ కొత్త పుంతలు తొక్కించారన్నారు. ఈ అవార్డులను అగ్ర శ్రేణి అమెరికా ఇన్నొవేటర్లకు అందిస్తుంటారు.

కింది స్థాయి నుంచి...
ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న శాస్త్రవేత్తలిద్దరిదీ కష్టించి కింది స్థాయి నుంచి ఎదిగిన నేపథ్యమే. గాడ్గిల్‌ 1950లో ముంబైలో జని్మంచారు. అక్కడ, ఐఐటీ కాన్పూర్‌లో ఫిజిక్స్‌లో డిగ్రీలు పొందారు. యూసీ బర్కిలీ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. 1980లో లారెన్స్‌ బర్కిలీ ల్యాబ్‌లో చేరారు. ఈ ఏడాదే రిటైరయ్యారు. అక్కడే సివిల్‌ అండ్‌ ఎని్వరాన్‌మెంటల్‌ గౌరవ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు.

చౌకైన, సురక్షిత తాగునీటి సదుపాయాలు, తక్కువ ఇంధనంతో సమర్థంగా పని చేసే గ్యాస్‌ స్టౌలు, మెరుగైన విద్యుద్దీపాల అభివృద్ధిలో ఆయన పరిశోధనలు ఎంతగానో దోహదపడ్డాయి. ముంబైకే చెందిన సురేశ్‌ నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ సారథిగా వ్యవహరించారు. ఈ ఘనత సాధించిన తొలి ఆసియన్‌ అమెరికన్‌గా నిలిచారు. 1956లో పుట్టిన ఆయన ఐఐటీ మద్రాస్‌ నుంచి బీటెక్‌ పూర్తి చేశారు. మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి రెండేళ్లలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1983లో బ్రౌన్‌ వర్సిటీలో ఇంజనీరింగ్‌ విభాగంలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రొఫెసర్‌గా రికార్డులకెక్కారు.

మరిన్ని వార్తలు