మొదట్లో ఇబ్బంది అనిపించింది!

6 Mar, 2015 23:58 IST|Sakshi
మొదట్లో ఇబ్బంది అనిపించింది!

 ‘‘కలలో కూడా ఊహించనవి జరిగినప్పుడు.. అది కూడా మంచి విషయాలైనప్పుడు స్వీట్ షాక్‌లా ఉంటుంది. ‘సూర్య వెర్సస్ సూర్య’కు అవకాశం వచ్చినప్పుడు నాకలాంటి అనుభూతే కలిగింది. నా మాతృభాష బెంగాలీలో పలు చిత్రాల్లో నటించినా, ఓ కొత్త భాషలో అవకాశం రావడం ఆనందంగా ఉంది’’ అని త్రిధా చౌదరి అన్నారు. నిఖిల్ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ‘సూర్య వెర్సస్ సూర్య’ ఈ గురువారం విడుదలైన విషయం తెలిసిందే.

ఈ చిత్రం ద్వారా త్రిధా కథానాయికగా పరిచయమయ్యారు. ఈ చిత్రం తనకు మంచి గుర్తింపు తెచ్చిందని త్రిధా చెబుతూ -‘‘వాస్తవానికి నేను పగటిపూటను ఇష్టపడినంతగా రాత్రిని ఇష్టపడను. కానీ, ఈ చిత్రం షూటింగ్ ఎక్కువగా రాత్రిపూట జరిగింది. దాంతో మొదటి రెండు, మూడు రోజులు ఇబ్బంది అనిపించింది. ఆ తర్వాత అడ్జస్ట్ అయ్యా’’ అన్నారు. ప్రస్తుతం బెంగాలీలో ప్రముఖ దర్శకుడు కమలేశ్వర్ ముఖర్జీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాననీ, తెలుగు చిత్రాలకు సంబంధించి కథలు వింటున్నాననీ త్రిధా తెలిపారు.