సుశాంత్‌ ఆత్మహత్య : పోలీసుల దర్యాప్తు ముమ్మరం

14 Jun, 2020 19:39 IST|Sakshi

సుశాంత్‌ ఆత్మహత్యపై ముంబై పోలీసులు దర్యాప్తు 

సాక్షి, ముంబై : బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యపై ముంబై పోలీసులు చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు. సుశాంత్ మానసిక స్థితితో పాటు ఆయన‌ బ్యాంక్‌ స్టేట్‌మెంట్లను పరిశీలిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డారా లేదా డిప్రెషన్‌తో చనిపోయారా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇటీవల సుశాంత్‌ బాంద్రాలో ఓ విలాసవంతమైన ఫ్లాట్‌కు మారినట్లు తెలుస్తోంది. నెలకు రూ.4.5 లక్షలు ఫ్లాట్‌ అద్దె చెల్లిస్తున్నటుగా పోలీసులు గుర్తించారు.

ముగ్గురు పనివాళ‍్లతో కలిసి సుశాంత్‌ బాంద్రా ఫ్టాట్‌లో నివసిస్తున్నారు. ఆదివారం ఉదయం జ్యూస్‌ తాగి బెడ్‌ రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్న సుశాంత్‌.. ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సుశాంత్‌ ఆత్మహత్య సమయంలో ఫ్లాట్‌లో పనివాళ‍్లతో పాటు స్నేహితులు ఉన్నారు. ఆయన చివరిగా‌ తన సోదరితో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది.  గడిచిన ఆరు నెలలుగా సుశాంత్‌ డిప్రెషన్‌లో ఉన్నట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. ఆయన నివాసంలో ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదని, కొన్ని మెడిసిన్స్‌ స్వాధీనం చేసుకున్నామని ముంబై పోలీసులు తెలిపారు. మరోవైపు సుశాంత్ ఫ్యామిలీ డాక్టర్‌తో పాటు, ఆయన‌ స్నేహితుల వద్ద స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు.  (చదవండి : సుశాంత్‌ ఆత్మహత్య: మాజీ ప్రేయసి స్పందన)

‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కానీ పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల కచ్చితమైన కారణం చెప్పగలం. ఆయన గదిలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులను కనుగొనలేదు. సూసైడ్‌ నోట్‌ లభించలేదు, కానీ డిప్రెషన్‌ తగ్గడానికి వాడే మందులు‌‌ కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకున్నాం. సుశాంత్‌ వ్యక్తిగత డాక్టర్‌ను సంప్రదించి, అతని మానసిక పరిస్థితి ఏంటి, ఏ రకమైన రుగ్మతతో బాధపడుతున్నాడు, తదితర విషయాలు అడిగి తెలుకుంటాం’ అని ముంబై జోన్‌ 9 డీసీపీ అభిషేక్ త్రిముఖే మీడియాకు తెలిపారు. కాగా, సుశాంత్‌ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని బంధువులు అంటున్నారు. లోతుగా దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. (చదవండి : హీరో సుశాంత్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య)

మరోవైపు సుశాంత్‌ ఆత్మహత్య వార్తతో బాలీవుడ్‌ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. కెరీర్‌లో మంచి స్టేజీలో ఉన్నపుడు ఆయన తీసుకున్న అనూహ్య నిర్ణయం అభిమానులతో కూడా కంటనీరు పెట్టిస్తుంది.  ఈ వార్త తమకు షాక్‌కు గురి చేసిందని, సుశాంత్‌ ఆత్మకు శాంతి చేకూరాలని  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు బాలీవుడ్‌, టాలీవుడ్‌ చెందిన పలువురు ట్వీట్‌ చేశారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

>
మరిన్ని వార్తలు