ఇలా కదా సినిమా తీయాలి అనిపించింది 

10 Dec, 2023 00:29 IST|Sakshi
వెంకటేశ్, అల్లు అరవింద్, చందు, సాయిపల్లవి, నాగార్జున, నాగచైతన్య, బన్నీ వాసు

అల్లు అరవింద్‌ 

‘‘వాస్తవ ఘటనలతో తెరకెక్కుతోన్న ‘తండేల్‌’ చిత్రం స్క్రిప్ట్, ప్రీ ప్రోడక్షన్‌కి ఏడాదిన్నర పట్టింది. ప్రీప్రోడక్షన్‌ వర్క్‌లో ‘తండేల్‌’ టీమ్‌ అంతా కూర్చొని ప్రతి విషయాన్ని చర్చించుకున్నప్పుడు సంతోషంగా అనిపించింది. ఇలా కదా సినిమా తీయాలి అనే తృప్తి కలిగింది’’ అని నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు.

నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘తండేల్‌’. చందు  మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా శనివారం ప్రారంభమైంది. ముహూర్తం వేడుకకు హీరో నాగార్జున కెమెరా స్విచ్చాన్‌ చేయగా, హీరో వెంకటేశ్‌ క్లాప్‌ ఇచ్చారు. అల్లు అరవింద్‌ స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ–‘‘తండేల్‌’ అన్ని సినిమాల్లా కాదు. 

బలమైన కథ, చాలా ప్రత్యేకమైనది.. కావాల్సిన సమయం తీసుకొని పక్కాగా ప్లాన్‌ చేసుకొని వెళ్దామని అరవింద్‌గారు ్రపోత్సహించారు. నా కెరీర్‌లో గుర్తుండిపోయే విజయాన్ని ‘100% లవ్‌’ సినిమాతో అరవింద్‌గారే ఇచ్చారు. ఇప్పుడు ‘తండేల్‌’ని ఆయన నిర్మించడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘ఏడాదిన్నరగా ‘తండేల్‌’ కథపై పని చేశాం. నేను నా బెస్ట్‌ ఇస్తాను’’ అన్నారు చందు మొండేటి.

‘‘మూడేళ్ల క్రితం ఈ స్క్రిప్ట్‌ గీతా ఆర్ట్స్‌కి వచ్చింది.. అప్పటి నుంచి కథ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. ఏడాదిన్నరగా ప్రీప్రోడక్షన్‌ పనులు జరిగాయి’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: శ్యామ్‌దత్‌.
 

>
మరిన్ని వార్తలు