పులితో ఆట...ఆ తర్వాత ఈత...

17 Jul, 2016 01:23 IST|Sakshi
పులితో ఆట...ఆ తర్వాత ఈత...

 ‘రేయ్.. పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో.. చూస్కో. పులితో ఫొటో దిగాలనిపించింది అనుకో.. కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, ట్రై చేయొచ్చు. సరే.. చనువిచ్చింది కదా అని పులితో ఆడుకోవాలనుకుంటే మాత్రం వేటాడేస్తది’.. అని ‘యమదొంగ’లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ గుర్తుండే ఉంటుంది. ఏదో సినిమా కాబట్టి ఫొటో దిగొచ్చని అన్నారు కానీ, నిజమైన పులితో ఎవరైనా ఆ పని చేయాలనుకుంటారా? ఒకవేళ అవి ఏమీ చేయవని తెలిసినా ఫొటో దిగే సాహసం చేయరు.
 
  కానీ, సుష్మితా సేన్ ఇక్కడ. వెరీ బోల్డ్. ఈ అందాల సుందరికి ఎప్పట్నుంచో పులిని దగ్గరగా చూడాలని కోరిక. వీలైతే పులిని ప్రేమగా నిమరాలని, ఫొటో దిగాలని కూడా అనుకున్నారు. తన చిరకాల కోరికను ఇటీవల సుష్మిత తీర్చేసుకున్నారు. దత్త పుత్రికలు పదహారేళ్ల రీనీ, ఆరేళ్ల అలీషాలు ఎక్కడైనా హాలిడే ట్రిప్ వెళదామని కన్నతల్లిలా చూసుకుంటున్న పెంపుడు తల్లి సుష్మితాని అడిగారట. అంతే.. థాయ్‌ల్యాండ్ తీసుకెళ్లారు. అక్కడ పుకెట్ జూకి ఈ తల్లీకూతుళ్లు వెళ్లారు. పులి దగ్గరకు వెళ్లి దాన్ని ప్రేమగా నిమిరి, ఫొటో దిగారు సుష్మిత. రీనీ కూడా ఆ సాహసం చేసింది.
 
 అలీషా మాత్రం ముందు భయపడిందట. కానీ, ఆ తర్వాత నాలుగు నెలల పులి పిల్ల దగ్గర కూర్చుని, ప్రేమగా నిమిరింది. పులితో తాము దిగిన ఫొటోలను సుస్మిత సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. ‘‘నాకు మూగజీవాలంటే ప్రేమతో పాటు గౌరవం. పెట్ యానిమల్స్‌ని పెంచుకుంటుంటాను. ఇప్పుడు పులిని దగ్గరగా చూడటం, ఫొటోలు దిగడం చాలా హ్యాపీగా అనిపించింది. నా కూతుళ్లు కూడా చాలా ఆనందపడ్డారు’’ అని సుష్మిత పేర్కొన్నారు.