సైరా సెట్లో అంతా సేఫ్‌

4 May, 2019 00:53 IST|Sakshi
చిరంజీవి

చిరంజీవి తాజా చిత్రం ‘సైరా’ సెట్‌ అగ్ని ప్రమాదానికి గురైంది. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సెట్‌ పూర్తిగా నాశనం అయిందని తెలిసింది. ఎవ్వరూ ప్రమాదానికి గురికాలేదు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘సైరా: నరసింహా రెడ్డి’. రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్‌ నగర శివార్లలోని కోకాపేట్‌లో 3 కోట్ల భారీ వ్యయంతో ప్రత్యేక సెట్‌ రూపొందించారు. శుక్రవారం ఉదయం షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా సెట్‌లో మంటలు చెలరేగాయి.

పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం గురించి రామ్‌చరణ్‌ స్పందిస్తూ– ‘‘అనూహ్యంగా సెట్లో ఫైర్‌ యాక్సిడెంట్‌ జరిగింది. ఎవ్వరికీ గాయాలు కాలేదు. మా టీమ్‌ అంతా సేఫ్‌గా ఉన్నారు. లాస్ట్‌ షెడ్యూల్‌ను త్వరగా పూర్తి చేయడానికి రెడీగా ఉన్నాం’’ అన్నారు. ‘‘ఫైర్‌ యాక్సిడెంట్‌ జరిగిన సెట్లో షూటింగ్‌ దాదాపు పూర్తయింది. సెట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ షాట్స్, చిరంజీవి మీద కొన్ని క్లోజప్‌ షాట్స్‌ షూటింగ్‌ మాత్రమే మిగిలి ఉంది’’ అని సమాచారం. ఈ ఏడాది దసరాకు రిలీజ్‌ కానున్న ఈ సినిమాకు అమిత్‌ త్రివేది సంగీతం సమకూరుస్తున్నారు.

మరిన్ని వార్తలు