శుక్రవారం మూడు మ్యాచ్‌లు గెలిచాయి

8 Dec, 2019 00:19 IST|Sakshi
భూపతిరాజా, ఉదయ్‌శంకర్, నిర్మల్‌కుమార్, శ్రీరామరాజు

– ఉదయ్‌ శంకర్‌

‘‘చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా కాన్సెప్ట్, కంటెంట్‌ కొత్తగా ఉంటే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. నాని, శర్వానంద్, విజయ్‌ దేవరకొండ, వంటి వారు డిఫరెంట్‌ సినిమాలు చేసి ప్రేక్షకుల ప్రోత్సాహంతోనే ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు. వీరిలానే నన్ను కూడా ఆదరించాలని కోరుకుంటున్నా’’ అన్నారు ఉదయ్‌ శంకర్‌. ఎన్వీ నిర్మల్‌కుమార్‌ దర్శకత్వంలో ఉదయ్‌శంకర్, ఐశ్వర్యా రాజేష్‌ జంటగా జి. శ్రీరామరాజు, భరత్‌ రామ్‌ నిర్మించిన చిత్రం ‘మిస్‌ మ్యాచ్‌’. ఈ నెల 6న విడుదలైన ఈ సినిమా సక్సెస్‌మీట్‌ శనివారం జరిగింది.

ఉదయ్‌శంకర్‌ మాట్లాడుతూ– ‘‘డిసెంబరు 6న మూడు మ్యాచ్‌లు గెలిచాయి. ఒకటి దిశ ఘటనలో దోషులకు సరైన శిక్ష పడింది. రెండు... టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారత్‌ విజయం సాధించింది. మూడు.. ‘మిస్‌మ్యాచ్‌’ చిత్రం విజయం సాధించింది. మా చిత్రంపై పాజిటివ్‌ మౌత్‌టాక్‌ నడుస్తోంది. మా సినిమాకు మంచి రివ్యూస్‌ వచ్చాయి. ప్రతి రివ్యూలోనూ కంటెంట్, కాన్సెప్ట్‌ కొత్తగా ఉన్నా యని రాశారు. ఈ క్రెడిట్‌ కథ అందించిన భూపతిరాజాగారికి దక్కుతుంది. కథను చక్కగా తెరకెక్కించారు నిర్మల్‌ కుమార్‌’’ అన్నారు.

‘‘నేనీ వేదికపై ఉన్నానంటే కారణం జీవీజీ రాజుగారు. తెలుగులో నేను చేసిన స్ట్రయిట్‌ మూవీ ఇది. భూపతిరాజాగారు మంచి కథ అందించారు’’ అన్నారు నిర్మల్‌ కుమార్‌. ‘కుటుంబంతో సరదాగా చూసే చిత్రం ఇది. సినిమాలో మంచి సందేశం కూడా ఉంది’’ అన్నారు శ్రీరామరాజు. ‘‘అమ్మాయి లక్ష్యం కోసం ఓ అబ్బాయి ప్రేమికుడిగా ఎంత తాపత్రయపడ్డాడు? అనే అంశం సినిమాలో ఒక హైలైట్‌ పాయింట్‌. రెండు కుటుంబాల కథ ఇది’’ అన్నారు భూపతిరాజా. నిర్మాత జీవీజీ రాజు, సంగీత దర్శకుడు గిఫ్టన్, కెమెరామేన్‌ గణేష్, ఎడిటర్‌ రాజా, రచయిత రాజేంద్రకుమార్‌ తదితరులు మాట్లాడారు. 

మరిన్ని వార్తలు