తండ్రీ కూతుళ్ల అనుబంధం

30 May, 2019 00:07 IST|Sakshi
తరుణ్‌ తేజ్, లావణ్య

తరుణ్‌ తేజ్, లావణ్య జంటగా నవీన్‌ నాయని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉండిపోరాదే’. డా.లింగేశ్వర్‌ నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ– ‘‘తండ్రీ, కూతుళ్ల మధ్య అనుబంధంపై  సినిమా అంటే ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఇటీవల కాలంలో చిన్న సినిమాలు, కొత్త వాళ్లతో చేసే సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఈ సినిమా కూడా మంచి హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

‘‘ఉండిపోరాదే...’ పాట ఎంతో ప్రజాదరణ పొందింది. దాన్ని సినిమా టైటిల్‌గా పెట్టడంతోనే సగం సక్సెస్‌ అయ్యారు దర్శక–నిర్మాతలు’’ అన్నారు ఏపీ ఫిల్మ్‌చాంబర్‌ సెక్రటరీ మోహన్‌ గౌడ్‌. నవీన్‌ నాయని మాట్లాడుతూ– ‘‘పక్కింటి అమ్మాయి జీవితం చూసినట్టుగా మా సినిమా ఉంటుంది. తండ్రీ కూతుళ్ల మధ్య సాగే ఎమోషనల్‌ డ్రామా అందరికీ  కనెక్ట్‌ అవుతూ, మనసులు కదిలించేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘మన జీవితంలో మధ్యలో ఎంత మంది వచ్చినా చివరి వరకూ మనల్ని ప్రేమించేది తల్లిదండ్రులే అనే సందేశంతో రూపొందిన చిత్రమిది’’ అని డా. లింగేశ్వర్‌ చెప్పారు. తరుణ్‌ తేజ్, లావణ్య, మాటల రచయిత సుబ్బారాయుడు బొంపెం, సంగీత దర్శకుడు సబు వర్గీస్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు