చిరుతో కాదు, ఎన్టీఆర్తో..?

21 Nov, 2015 09:05 IST|Sakshi

అఖిల్ సినిమా ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోవటంతో దర్శకుడు వివి వినాయక్ మళ్లీ ఆలోచనలో పడ్డాడు. అఖిల్ సినిమా సెట్స్ మీద ఉండగానే చిరంజీవి 150వ సినిమాను వినాయక్ డైరెక్ట్ చేయనున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఆ విషయం అధికారికంగా ప్రకటించకపోయినా, ఖండించనూలేదు. దీంతో వినాయక్ తర్వాతి ప్రాజెక్ట్ చిరుతోనే ఉంటుందని భావించారు ఫ్యాన్స్.

చిరు మాత్రం ఇంత వరకు తన ప్రతిష్టాత్మక చిత్రం ఎవరితో ఉంటుందన్న విషయాన్ని నిర్ణయించలేదు. పూరితో సినిమా ఉంటుందని తొలుత వార్తలు రాగా, తర్వాత వినాయక్ తో అని టాక్ వచ్చింది. అయితే వినాయక్కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో టైం వేస్ట్ చేసుకోవటం ఇష్టం లేని వినాయక్ మరో హీరోతో సినిమా మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడట. అందుకే ఆది, అదుర్స్ లాంటి భారీ విజయాలు సాధించిన ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట.

అఖిల్ సినిమా తరువాత రెండు నెలల పాటు సెలవు తీసుకుంటానని ప్రకటించిన వినాయక్, త్వరలోనే ఎన్టీఆర్కు కథ చెప్పాలని నిర్ణయించుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అదుర్స్ లాంటి భారీ విజయం తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావటంతో భారీ అంచనాలు ఉంటాయన్న ఉద్దేశంతో, ఆ అంచనాలను అందుకునే స్ధాయి కథ కోసం వేట ప్రారంభించారు. మరోసారి కామెడీ ఎంటర్టైనర్తో ఆడియన్స్ను మెప్పించే ఆలోచనలో ఉన్నాడు వినాయక్.

ప్రస్తుతం నాన్నకు ప్రేమతో సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్, ఆ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ (వర్కింగ్ టైటిల్)లో నటించనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యే సరికి పక్కా స్క్రిప్ట్ తో రెడీ అవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నాడట వినాయక్.