ఎట్టకేలకు కల నిజమైంది

25 Dec, 2013 22:59 IST|Sakshi
 ఎట్టకేలకు తన కల నిజమైందని వర్ధమాన నటుడు హిమాన్ష్ కొహ్లీపేర్కొన్నాడు. యారియా సినిమా ప్రమోషన్ కోసం దర్శకుడు ఖోస్లా కుమార్, సహనటుడు రకుల్‌ప్రీత్‌సింగ్‌లతో కలసి హిమాన్ష్.. ఇటీవల సల్మాన్‌ఖాన్‌తో బిగ్‌బాస్ ధారావాహిక కార్యక్రమంలో వేదికను పంచుకున్నాడు. ఈ సందర్భంగా నటన బాగుందంటూ సల్మాన్ ప్రశంసించడంతో కొహ్లీ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. నగరంలోని ఎస్‌ఎల్ వవరల్డ్‌లో మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తన మనోభావాలను మీడియాతో పంచుకున్నాడు.‘బిగ్ బాస్‌కు వెళ్లడం అనేది ఓ కల లాంటిది. కొత్తగా బాలీవుడ్‌లోకి అడుగిడిన నాలాంటి వర్ధమాన నటుడు చేసిన నటనను సల్మాన్‌లాంటి గొప్ప నటుడు ప్రశంసించడమనేది గొప్ప విషయం. చిన్ననాటి నుంచి నాకు సల్మాన్ అంటే ఎంతో ఇష్టం.
 
 ఆయన సినిమాలే చూసేవాడిని. బిగ్‌బాస్ ధారావాహిక కార్యక్రమంలో ఆయనతో వేదిక పంచుకున్నా. దీంతో నా కల నిజమైంది’ అని అన్నాడు. ఇక సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో సైతం అమితాబ్ బచ్చన్, సల్మాన్‌ఖాన్, సోనాక్షి సిన్హా తదితర నటులు యారియా సినిమా ట్రయలర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ట్రయలర్ ఎంతో తాజాగా, వర్ణశోభితంగా ఉందని వారు ఆయా సైట్లలో వ్యాఖ్యానించారు. అటువంటి గొప్ప గొప్ప నటులు స్క్రీన్‌పై తనలాంటి వాళ్ల నటనాతీరుపై ప్రశంసల జల్లు కురిపిస్తే ఎంతో చక్కని అనుభూతి కలుగుతుందన్నాడు. కాగా చానల్ వీలో ప్రసారమయ్యే ‘హంసే హై లైఫ్’ ధారావాహికలో నటించిన హిమాన్ష్... అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు.