లీటరు పాలు..81 మంది విద్యార్థులకు

30 Nov, 2019 03:50 IST|Sakshi

యూపీ మధ్యాహ్న భోజన పథకంలో నిర్వాకం

సోన్‌భద్ర: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం ఎంత దారుణంగా అమలవుతుందో తెలిపే ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లా చోపన్‌ బ్లాక్‌లోని కోటా గ్రామ పంచాయతీలో ఈ ఘటన ఇటీవల చోటుచేసుకుంది. సలాయి బన్వా ప్రాథ మిక పాఠశాలలో 81 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారికి రోజూ మధ్యాహ్నం గ్లాసు పాలు అందించాల్సి ఉంటుంది. పాఠశాల నిర్వాహకుడు (శిక్షామిత్ర)మాత్రం లీటరు పాలు తెప్పించి, వాటిని బకెట్‌ నీళ్లలో కలిపి ఒక్కో విద్యార్థికి అరగ్లాసు చొప్పున అందిస్తున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. స్పందించిన జిల్లా మేజిస్ట్రేట్‌ రాజలింగన్‌ శుక్రవారం పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల నుంచి వివరాలను తెలుసుకుని ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేయడంతోపాటు అతనిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, మిర్జాపూర్‌ జిల్లా సియూర్‌ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ఒక మహిళ రొట్టెలు, మరో మహిళ ఉప్పు పంచుతున్న వీడియో ఒకటి ఆగస్టులో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కాగా అధికారులు అప్పట్లో హడావుడి చేశారు. 

మరిన్ని వార్తలు