సాక్షి, న్యూఢిల్లీ: దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన అగ్ని ప్రమాదాల్లో ఒకటైన ఉపాహార్ సినిమాహాల్ ఘటన జరిగి 18 ఏళ్లు పూర్తయ్యాయి. బాధిత కుటుంబాలు ఇప్పటికీ సుదీర్ఘ న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రాణాలు కోల్పోయిన 59 మందికి శనివారం నివాళులు అర్పించడంతో పాటు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆదివారం మరోమారు గ్రీన్పార్క్లో సమావేశం కానున్నారు. నేరస్తులకు తగిన శిక్ష విధించాలని బాధిత కుటుంబాలకు చెందినవారు డిమాండ్ చేస్తున్నారు. అసోసియేషన ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ ఉపహార్ ట్రాజెడీ వెనుకున్న ప్రధాన శక్తి నీలం కష్ణమూర్తి ఈ విషయం చెప్పారు. తమకు కడుపుకోత పెట్టిన ఉపహార్ సినిమా థియేటర్ యజమానులైన గోపాల్ అన్సల్, సుశీల అన్సల్కు శిక్ష పడేలా చేయడానికి అసోసియేషన్ తరపున ఆమె 18 సంవత్సరాలుగా పోరాడుతున్నారు.
ఉపహార్ ఘటన జరిగిన తువాత పెల్లుబికిన ప్రజాగ్రహంతో ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించింది. కేసుపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు పదేళ్ల అనంతరం 2007లో అన్సల్ లతో పాటు 12 మందిని నేరస్థులుగా గుర్తించింది. అయితే ఆతరువాతి సంవత్సరం ఢిల్లీ న్యాయస్థానం 12 మందిలో ఆరుగురిని నిర్దోషులుగా ప్రకటించడం తో పాటు సుశీల్ అన్సల్, గోపాల్ అన్సల్ల శిక్షను ఒక సంవత్సరానికి తగ్గించింది. దానితో బాధిత కుటుంబాలు, సీబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించి శిక్షను పెంచవలసిందిగా కోరాయి. అనేక వాయిదాల తరువాత 2013లో సుప్రీంకోర్టు కేసు విచారణను ముగించింది. ఆ తరవాతి సంవత్సరం అన్సల్ సోదరులను నేరస్తులుగా నిర్ధారించింది. న్యాయమూర్తులు శిక్ష విషయంలో భిన్నాభిప్రాయాలకు వచ్చి కేసును త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్ చేశారు. అయితే కోర్టు ఉత్తర్వు వెలువడి ఒక సంవత్సరం దాటి మూడు నెలలైనా వ్యవహారం పెండింగులోనే ఉందని నీలం కృష్ణమూర్తి చెప్పారు. ఎన్నాళ్లయినా న్యాయం కోసం తాము జరుపుతున్న పోరాటం ఆగదని ఆర్థికంగా సామాజికంగా పలుకుబడి కలిగిన అన్సల్లకు తగిన శిక్ష పడేలా చేసి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నదే తమ సంకల్పమని ఆమె చెప్పారు.