యమునలో కరసేవకులకు పిండ ప్రధానం

4 Dec, 2023 12:55 IST|Sakshi

అయోధ్యలో రామ మందిరం ‍ప్రారంభానికి సిద్ధమైంది. ఈ ఆలయాన్ని 2024 జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దీనికి ముందుగా 1990లో రామజన్మభూమి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కరసేవకుల ఆత్మశాంతి కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అఖిల భారత హిందూ మహాసభ సభ్యులు మథురలో యమునా నది తీరాన ఉన్న విశ్రామ్ ఘాట్ వద్ద కరసేవకులకు ఆత్మ శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ పిండ ప్రధానం చేయనున్నారు.

రామజన్మభూమి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కరసేవకుల కోసం పిండ ప్రధానాన్ని డిసెంబర్ 6న మధురలో నిర్వహించనున్నట్లు అఖిల భారత హిందూ మహాసభ (ఏబీహెచ్‌ఎం) జాతీయ అధ్యక్షుడు రాజ్యశ్రీ చౌదరి తెలిపారు. నాడు అయోధ్యలో కవాతు చేస్తున్న కరసేవకులపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటనను చౌదరి గుర్తు చేశారు.

విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం కరసేవకులు చేసిన త్యాగాన్ని మనం ఎన్నటికీ మరువలేమన్నారు. రామ మందిర నిర్మాణం మొదటి దశ పూర్తయిన నేపధ్యంలో, రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్న తరుణంలో మనం వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

కాగా 2019 నవంబరు 9న సుప్రీం కోర్టు హిందువులకు అనుకూలంగా తీర్పునిస్తూ, అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలని ఆదేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020, ఆగస్టు 5న రామమందిరానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆలయ నిర్మాణం మొదలైంది. 
ఇది కూడా చదవండి: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ‘నోటా’కు ఎన్ని ఓట్లు?

>
మరిన్ని వార్తలు