స్వల్ప ప్రమాదానికి గురైన రాష్ట్రపతి కాన్వాయ్..

15 Jul, 2016 13:23 IST|Sakshi

డార్జలింగ్ః రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కాన్వాయ్ కి స్వల్ప ప్రమాదం ఎదురైంది. ఉదయం బగ్దోగ్రా నుంచి ఢిల్లీ  విమానం ఎక్కేందుకు బయల్దేరిన రాషప్ట్రపతి కాన్వాయ్ 30 కిలోమీటర్లు ప్రయాణించగానే ప్రమాదానికి గురైంది. సొనాడా ప్రాంతానికి చేరగానే కాన్వాయ్ లోని మూడో వాహనం  రోడ్డునుంచి జారి పక్కకు పడిపోయింది. ప్రమాదంలో ఆరుగురు సెక్యూరిటీ సిబ్బందికి గాయాలైనట్లు తెలుస్తోంది.

ఢిల్లీ విమానం ఎక్కేందుకు బగ్దోగ్ రానుంచి బయల్దేరిన రాష్ట్రపతి కాన్వాయ్ కి తృటిలో భారీ ప్రమాదం తప్పింది. విమానం ఎక్కేందుకు రాష్ట్రపతి బయల్దేరిన కొద్ది సేపటికి సొనాడో ప్రాంతానికి రాగానే అక్కడ కొండ చెరియలు విరిగి పడటంతో కాన్వాయ్ లోని మూడో వాహనం జారి పక్కకు పడిపోయింది.

ప్రమాదంలో ఆరుగురికి గాయాలు కాగా, రాష్ట్రపతితోపాటు మిగిలిన సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం.. ఢిల్లీలో జరిగే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా  రాష్ట్రపతితోపాటు కాన్వాయ్ లో ప్రయాణిస్తున్నారు. గాయపడిన వారిలో రాష్ట్రపతి చీఫ్ సెక్యూరిటీ అధికారి ఏపీ సింగ్ ఉన్నారు.

భారీ వర్షాలు, మంచు కారణంగా ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు  రాష్ట్రపతి ప్రయాణానికి హాజరు కాలేకపోవడంతో ఆయన రోడ్డు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్రపతి కార్యాలయానికి చెందిన సైనిక సిబ్బంది హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సురక్షిత ప్రాంతానికి తరలించడంతోపాటు, అక్కడి ఆపరేషన్ ను మమతా బెనర్జీ దగ్గరుండి పర్యవేక్షించినట్లు  ఆమె ప్రెస్ సెక్రెటరీ వేణు రాజమణి తెలిపారు. సహాయక చర్యల్లో పార్లమెంట్ సభ్యుడు, రాష్ట్రపతి కుమారుడు అభిజిత్ ముఖర్జీ కూడా సహాయపడ్డారు.

>
మరిన్ని వార్తలు