విమానాల్లో మ‌ధ్య సీట్ల‌ను ఖాళీగా ఉంచండి

1 Jun, 2020 17:47 IST|Sakshi

ఎయిర్‌లైన్స్‌కు కొత్త మార్గదర్శకాలు

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మరి కారణంగా విధించిన లాక్‌డౌన్‌ను తాజాగా మరోమారు కేంద్రప్రభుత్వం పొడిగించింది. అయితే ఈసారి లాక్‌డౌన్‌లో మరిన్ని సడలింపులకు అవకాశం ఇచ్చింది. రవాణా సౌకర్యాల విషయంలో కొన్ని వెసులుబాటులను ఇస్తూ మే 25 నుంచి దేశీయ విమానాల రాకపోకలను పునరుద్దరించిన విషయం తెలిసిందే. అయితే విమాన ప్రయాణాల్లో పాటించాల్సిన జాగ్రత్తపై విమానయాన శాఖ కంపెనీలకు కొన్ని మార్గదర్శకాలు చేసింది. ముఖ్యంగా సామాజిక దూరం విషయంలో చేపట్టాల్సిన చర్యలపై కీలక సూచనలు చేసింది. విమానాల్లో ప్రయాణించేటప్పుడు సామాజిక దూరం పాటించే క్రమంలో విమానంలో మధ్యలో ఉండే సీటును ఖాళీగా ఉంచాలని విమానయాన శాఖ ఆదేశించింది. అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని అని మధ్యలో సీటును ఖాళీగా ఉంచాల్సి వస్తే ఆ సీటు ఖరీదు భారం మిగిలిన ప్రయాణీకులపై పడి టికెట్‌ ధర అధికమవుతుందని ఎయిర్‌లైన్స్‌ కంపెనీలు ఏవియేషన్‌ శాఖకు విన్నవించుకున్నాయి. (పావురం సిక్స్ ప్యాక్ ట్రైనింగ్ అదిరింది)

దీని గురించి ఆలోచించిన కేంద్రప్రభుత్వం మధ్యలో  సీటు కేటాయించిన వారికి చుట్టూ కప్పబడి రక్షణ కవచంలా ఉండే గౌను అందించాలని ఎయిర్‌లైన్స్‌ కంపెనీలను ఆదేశించింది. ఈ గౌనును జౌళి శాఖ అంగీకరించిన ఆరోగ్యప్రమాణాలతో  తయారు చేయాలని విమానయాన శాఖ సూచించింది. దీనితో పాటు శానిటైజర్లు అందుబాటులో ఉంచడం, క్యాబిన్‌ ఎయిర్‌ను తరుచుగా మార్చుతుండటం, ఎలాంటి ఆహారాన్ని విమానాల్లో సరఫరా చేయకూడదని ఆదేశించింది. అయితే ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కొన్ని ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచొచ్చు. మధ్యసీటు ఖాళీగా ఉంచే అవకాశం ఉంటే విమానాల్లో కచ్ఛితంగా సామాజిక దూరం పాటించేలా చూడాలని, ఒకే కుటుంబానికి చెందిన వారికి పక్కపక్కనే కూర్చొనే అవకాశం కల్పించవచ్చని విమానయాన శాఖ పేర్కొంది. (రోనా: రోజుల డి కోమాలో శిశువు)

మధ్యలో సీటు ఖాళీగా ఉంచే అంశంపై సుప్రీం కోర్టు స్పందిస్తూ విమానాల్లో సామాజిక దూరం పాటించాలంటే మధ్యలో సీటును కచ్చితంగా ఖాళీగా ఉంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎయిర్‌లైన్స్‌ ఆర్ధిక ప్రగతి గురించి కాకుండా ప్రజల ఆరోగ్యం గురించే చింతించాలని సూచించింది. మే7న వందేమాతరం మిషన్‌లో భాగంగా విదేశాల్లో ఉన్న భారతీయులను విమానాల ద్వారా స్వదేశానికి తీసుకువచ్చే సమయంలో బయట ఆరు అడుగుల సామాజిక దూరాన్ని పాటిస్తున్నాం, మరి విమానాల్లో సామాజిక దూరం విషయం ఏంటి అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే ప్రశ్నించారు. 

అయితే విమానాల్లో మధ్య సీట్ల బుకింగ్‌కు కేవలం జూన్‌ 7 వరకు మాత్రమే అవకాశం కల్పించాలని కోర్టు తెలిపింది.  బాంబే హైకోర్టులో ఈ మధ్యసీట్లు విషయానికి సంబంధించి పిటీషన్‌ దాఖలైంది. దీనిపై బాంబే హైకోర్టు రేపు విచారించనుంది. ఇదిలా ఉండగా కేంద్ర విమానయాన శాఖా మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి విమానాల్లో మధ్య సీటు ఖాళీగా ఉంచడాన్ని ఖండించారు. దీనివల్ల టికెట్‌ ధరలు అధికంగా పెరుగుతాయన్నారు.   

మరిన్ని వార్తలు