సైనికుల డిమాండ్‌కు మొండిచేయి

4 Dec, 2018 21:13 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ : సాయుధ దళాలు దీర్ఘకాలంగా కోరుతున్న సైనిక సేవల వేతనం (ఎంఎస్‌పీ)పెంపు డిమాండ్‌ను కేంద్రం​తోసిపుచ్చింది. సైన్యంలో జూనియర్‌ కమిషన్డ్‌ అధికారులు (జేసీఓ) సహా 1.12 లక్షల సైనిక సిబ్బందికి ఎంఎస్‌పీ పెంచాలని సైనికులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. కాగా తమ డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించడంపై ఆర్మీ వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయని, ఆర్థిక మంత్రిత్వ శాఖ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరతాయని అధికారులు చెబుతున్నారు.

అయితే సైనిక సేవల వేతనం నెలకు రూ 5,500 నుంచి రూ 10,000కు పెంచితే ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ 610 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. జేసీఓలు, జవాన్లకు నెలకు రూ 5,200ను ఎంఎస్‌పీగా ఏడవ వేతన సంఘం ఖరారు చేయగా, లెఫ్టినెంట్‌ , బ్రిగేడియర్‌ ర్యాంకుల మధ్య అధికారులకు రూ 15,500 ఎంఎస్‌పీని నిర్ణయించింది.

జేసీఓలు తాము గెజిటెడ్‌ అధికారులమని (గ్రూప్‌ బీ), సైనిక దళాల్లో కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్న దృష్ట్యా అధిక ఎంఎస్‌పీ నిర్ణయించాలని ఎంతోకాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. దీనిపై ఆర్మీ ఉన్నతాధికారులు రక్షణ మంత్రిత్వ శాఖ, త్రివిద దళాధిపతుల దృష్టికి తీసుకువెళ్లారని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు