ఆర్ఏఎస్ నియామక పరీక్షలో భగవద్గీత సిలబస్

16 Apr, 2018 17:56 IST|Sakshi

సాక్షి, జైపూర్‌ : రాజస్థాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ 2018 (ఆర్‌ఏఎస్‌) పరీక్షకు సంబంధించి జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ స్టడీస్‌ పేపర్‌లో భగవద్గీత సారాంశానికి సంబంధించిన పాఠాలను సిలబస్ లో చేర్చారు. రాజస్ధాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఆర్‌పీఎస్‌సీ) నిర్వహించే ఈ పరీక్షలకు చెందిన జనరల్ స్టడీస్ చేసిన మార్పుల్లో భాగంగా ఈ అంశాలను సిలబస్‌లో చేర్చింది. నీతి శాస్త్ర పేరుతో గీత బోధనలను ప్రత్యేకంగా చేర్చారు. భగవద్గీతతో పాటు మహాత్మ గాంధీ జీవితానికి సంబంధించిన పాఠాలు, దేశ ప్రముఖులు, సాంఘిక సంస్కర్తలు, కార్యనిర్వాహక అధికారుల చరిత్రలనూ పాఠ్యాంశాలుగా చేర్చారు.

నిర్వహణ, పాలనా విభాగాల్లో భగవద్గీత పాత్ర పేరిట సబ్‌-యూనిట్‌ను జోడిస్తూ ఆర్‌ఏఎస్‌ 2018 పరీక్ష సిలబస్‌ను సవరించారు. దీంతో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన 18 అధ్యాయాల నుంచి పలు ప్రశ్నలు ఆర్‌ఏఎస్‌ 2018 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎదురవనున్నాయి. బీజేపీ ప్రభుత్వం విద్యా రంగాన్ని కాషాయీకరిస్తోందని విపక్షాలు భగ్గుమంటున్న నేపథ్యంలో రాజస్థాన్‌ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని వార్తలు