విద్యుత్ చార్జీల నుంచి ఊరట

3 Nov, 2014 00:18 IST|Sakshi

సాక్షి, ముంబై: రవాణా శాఖలో వస్తున్న నష్టాన్ని విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేయవద్దని బృహన్‌ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థను కేంద్రీయ విద్యుత్ అపీల్ ట్రిబ్యూనల్ ఆదేశించింది. దీంతో ముంబైతోపాటు తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో బెస్ట్ విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ చార్జీల నుంచి కొంతమేర ఊరట లభించనుంది. ప్రతీ యూనిట్‌కు దాదాపు 55 పైసల చొప్పున విద్యుత్ బిల్లులు తగ్గనున్నాయి.

బెస్ట్ సంస్థ ఆధీనంలో రవాణ, విద్యుత్ శాఖలు ఉన్నాయి. ఇందులో విద్యుత్ శాఖ లాభాల భాటలో ఉండగా రవాణా సంస్థ రూ.590 కోట్ల నష్టాల బాటలో నడుస్తోంది. దీంతో నష్టాల్లో నడుస్తున్న రవాణా శాఖను కొంతమేర గట్టెక్కించేందుకు కొంత కాలంగా సంస్థ విద్యుత్ వినియోగదారుల నుంచి ప్రత్యేక పన్ను (టీడీఎల్‌ఆర్) వసూలు చేస్తోంది.

అందుకు మహారాష్ట్ర విద్యుత్ రెగ్యూలేటరీ కమిషన్ అనుమతి ఇచ్చింది. దీంతో సామాన్య విద్యుత్ వినియోగదారుడిపై యూనిట్‌కు 55 పైసల అదనపు భారం పడుతోంది. ఇలా వసూలు చేస్తున్న ప్రత్యేక పన్ను ద్వారా బెస్ట్ సంస్థకు ప్రతీ నెల రూ.60 కోట్లు అదనంగా లభిస్తున్నాయి. కాని బిల్లులు మాత్రం విపరీతంగా పెరిగి వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి. దీంతో పెరిగిన విద్యుత్ బిల్లులతో సతమతమైతున్న ముంబైకర్లకు తాజాగా జారీచేసిన ట్రిబ్యునల్ ఆదేశాలు ఎంతో ఉపశమనం కల్గించనున్నాయి.  

మరిన్ని వార్తలు