178 సార్లు నెట్‌ సర్వీసులు కట్‌!

12 Aug, 2019 20:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌లో మొబైల్‌ ఫోన్, మొబైల్‌ ఇంటర్నెట్, బ్రాడ్‌ బ్యాండ్‌ సర్వీసులే కాకుండా ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ సర్వీసులు కూడా గత వారం రోజులుగా నిలిచిపోయాయి. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ ఆర్టికల్‌ను రద్దు చేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వీటి సేవలు నిలిచి పోయిన విషయం తెల్సిందే. కశ్మీర్‌లో ఈ సేవలను నిలిపివేయడం మూడోసారో, 30వ సారో కాదు. 2012 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 178 సార్లు నిలిపివేసినట్లు ఇంటర్నెట్‌ వాచ్‌డాగ్‌ ‘ఫ్రీడమ్‌ లా సెంటర్‌ (ఇండియా)’ ఓ నివేదిలో వెల్లడించింది. ఈసారి ల్యాండ్‌లైన్‌ సేవలను కూడా నిలిపివేయడం ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం. 

గత వారం రోజులుగా వార్తా పత్రికలు కూడా ప్రచురితం కాకపోవడంతో రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియని ఆందోళనకరమైన పరిస్థితి కొనసాగుతోంది. శాటిలైట్‌ డిషెస్‌ ఉన్న వాళ్లు మాత్రమే కశ్మీర్‌ గురించి జాతి జనులనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని చూడగలిగారు. నేటి వరకు వాటిలో వస్తున్న టీవీ ఛానళ్ల ద్వారా వార్తలు తెలసుకోగలుగుతున్నారు. ప్రజా ఎమర్జెన్సీ, ప్రజా భద్రతను దష్టిలో పెట్టుకొని ‘టెంపరరీ సస్పెన్షన్‌ ఆఫ్‌ టెలికమ్‌ సర్వీసెస్‌ (పబ్లిక్‌ ఎమర్జెన్సీ ఆర్‌ పబ్లిక్‌ సేఫ్టీ) రూల్స్‌ 2017’ కింద కమ్యూనికేషన్‌ సర్వీసులను ప్రభుత్వం నిలిపివేయవచ్చు. 

కశ్మీర్‌లో ల్యాండ్‌ ఫోన్‌ సర్వీసులనైతే ప్రభుత్వం అతి సులువుగా నిలిపివేయచ్చు. ఎందుకంటే ప్రభుత్వ సంస్థ అయిన ఒక్క బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రమే కశ్మీర్‌లో ఈ సర్వీసులను నిర్వహిస్తోంది. అయినప్పటికీ 1971 నుంచి కశ్మీర్‌లో ల్యాండ్‌ లైన్‌ కమ్యూనికేషన్‌ సేవలను నిలిపివేయలేదని, ఇదే మొదటిసారని సంబంధిత అధికారులు తెలియజేస్తున్నారు. కనీసం కార్గిల్‌ యుద్ధం అప్పుడు కూడా ఈ సేవలను నిలిపి వేయలేదట. అయితే హిజ్‌బుల్‌ ముజాహిద్దీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వాణి ఎన్‌కౌంటర్‌ జరిగినప్పుడు బారముల్లా, బండిపొర, కుప్వారా జిల్లాల్లో ల్యాండ్‌లైన్‌ సర్వీసులను నిలిపివేశారట. 
 

మరిన్ని వార్తలు