మా నర్సులను వెనక్కి రప్పించండి..

1 Apr, 2015 14:29 IST|Sakshi

తిరువనంతపురం: యెమెన్లో చిక్కుకుపోయిన కేరళ నర్సులు, పారా మెడికల్ సిబ్బందిని  తిరిగి స్వదేశానికి రప్పించాలని  కేరళ సీఎం ఊమెన్ చాందీ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. దీనిపై తక్షణమే స్పందించి , తగిన చర్యలు చేపట్టాలని కోరుతూ ప్రధానికి ఆయనో లేఖ రాశారు.

తమను వెనక్కి రప్పించాలని కోరుతూ అనేకమంది నర్సులు భయంతో  వణికిపోతూ ఫోన్లు చేస్తున్నారనీ... కన్నీళ్లతో  వేడుకుంటున్నారని చాందీ చెప్పారు. సానా మిలిటరీ ఆసుపత్రి యాజమాన్యం సహా కొన్ని ఆసుపత్రులు  తమ దేశాన్ని వీడిచి వెళ్లేందుకు నర్సులకు, ఇతర సిబ్బందికి అనుమతి నిరాకరిస్తున్నారని తెలిపారు.   వారి పాస్పోర్టులను తమ దగ్గర పెట్టుకొని  నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. దీనికి సంబంధించి  భారత రాయబార కార్యాలయం ఆయా ఆసుపత్రులతో మాట్లాడి, తగిన చర్యలు  చేపట్టాలని ముఖ్యమంత్రి కోరారు.

కేరళ ప్రభుత్వ  లెక్కల ప్రకారం సుమారు 600 మంది కేరళీయులు సానా విమానాశ్రయంలో  ఎదురుతెన్నులు చూస్తున్నట్టు సమాచారం. యెమన్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారతీయులను ఇండియాకు  రప్పించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. వీలైన అన్ని మార్గాల ద్వారా స్వదేశానికి వచ్చేయాలని కూడా భారత ప్రభుత్వం అక్కడున్న మనవారికి అడ్వైజరీ ఇచ్చింది.

మరిన్ని వార్తలు