ఖడ్సేకు డిప్యూటీ సీఎం చాంబర్

6 Nov, 2014 23:08 IST|Sakshi

 సాక్షి, ముంబై: రెవెన్యూ శాఖ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సేకు మంత్రాలయలోని ఆరో అంతస్తులో ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి క్యాబిన్‌ను కేటాయించారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో తనకు ఉపముఖ్యమంత్రి పదవి రావచ్చని ఖడ్సే ఊహించారు. అయితే రెవెన్యూ శాఖ కేటాయించడంతో ఆయన కొంత అసంతృప్తికి లోనయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

కాగా, ఆయనను ఈ విషయంలో కొంత శాంతింపజేయడానికే మాజీ ఉప ముఖ్యమంత్రి వినియోగించిన క్యాబిన్‌ను కేటాయించి ఉంటారనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉండగా, బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు క్యాబిన్లు, చాంబర్లు, బంగళాలు కేటాయించవచ్చని అందరూ భావించారు. కాని ఫడ్నవిస్ అలా చేయలేదు.

 సమావేశ మనంతరం మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ క్యాబిన్‌ను ఖడ్సేకు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డేకు మొదటి అంతస్తులో ఉన్న ఆర్.ఆర్.పాటిల్ క్యాబిన్, గ్రామాభివృద్ధి శాఖ మంత్రి పంకజా ముండేకు నాలుగో అంతస్తులో ఉన్న అదే శాఖ మాజీ మంత్రి జయంత్ పాటిల్ క్యాబిన్ కేటాయించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.  

మరిన్ని వార్తలు