రామాయణంపై ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

10 Aug, 2018 14:47 IST|Sakshi
కాంగ్రెస్‌ ఎంపీ హుసేన్‌ దల్వాయ్‌ (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్‌ తలాఖ్‌పై కాంగ్రెస్‌ ఎంపీ హుసేన్‌ దల్వాయ్‌ రామాయణాన్ని ఉటంకిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్‌ తలాఖ్‌ బిల్లును సభ ముందుంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాముడు సైతం సీతను అనుమానిస్తూ విడిచిపెట్డాడని కాంగ్రెస్‌ ఎంపీ వ్యాఖ్యానించారు.మహిళలను కేవలం ముస్లింలే కాకుండా హిందూ, క్రిస్టియన్‌, సిక్కు మతాలు సైతం వివక్షకు గురిచేశాయని అన్నారు.

ప్రతి సమాజం పురుషాధిక్యతతో కూడుకున్నదని అంటూ శ్రీరాముడు సైతం అనుమానంతో సీతాదేవిని విడిచిపెట్డాని వ్యాఖ్యానించారు. మొత్తం వ్యవస్థను మనం మార్చాల్సిన అవసరం ఉందని హుసేన్‌ దల్వాయ్‌ పేర్కొన్నారు.ముస్లిం మహిళల సంక్షేమంపై మోదీ సర్కార్‌కు ఎలాంటి ఆసక్తి లేదని ఆరోపించారు. ముస్లిం మహిళలకు మరిన్ని హక్కులు కల్పిస్తూ సాధికారత ఇస్తామని హామీ ఇవ్వడం కేవలం కంటితుడుపు చర్యని వ్యాఖ్యానించారు.

మరోవైపు ట్రిపుల్‌ తలాఖ్‌పై తమ పార్టీ వైఖరి సుస్పష్టమని యూపీఏ చైర్‌పర్సన్‌, కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌ సోనియా గాంధీ అన్నారు. రాఫెల్‌ డీల్‌పై కాంగ్రెస్‌ ఆందోళనలతో రాజ్యసభ పలుమార్లు వాయిదా పడటంతో శుక్రవారం ట్రిపుల్‌ తలాఖ్‌ బిల్లును ప్రభుత్వం సభలో చేపట్టలేకపోయింది.

మరిన్ని వార్తలు