తొలి ‘అనర్హత’ కాంగ్రెస్ ఎంపీపైనే !

20 Sep, 2013 09:17 IST|Sakshi
తొలి ‘అనర్హత’ కాంగ్రెస్ ఎంపీపైనే !

న్యూఢిల్లీ: ఎమ్మెల్యేలు, ఎంపీలు కేసుల్లో దోషులుగా తేలిన వెంటనే పదవులకు అనర్హులవుతారని సుప్రీం కోర్టు ఇచ్చిన కీలక తీర్పు కాంగ్రెస్‌ను చిక్కుల్లో పడేసింది. దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో త్రిపుర రాష్ట్రానికి కేటాయించిన ఎంబిబిఎస్ సీట్లను అనర్హులైన అభ్యర్థులకు కట్టబెట్టిన వ్యవహారంలో రాజ్యసభ సభ్యుడు రషీద్ మసూద్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు గురువారం దోషిగా నిర్ధారించింది. తీర్పు వచ్చాక.. తొలిసారి కేంద్ర మాజీ మంత్రి రషీద్  దోషిగా తేలారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడైన ఆయనను అవినీతి, ఇతర నేరాల కేసుల్లో ఇక్కడి సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించింది.

దీంతో ఆయనపై అనర్హత వేటుకు రంగం సిద్ధమైంది. దోషులుగా తేలిన ఎమ్మెల్యేలు, ఎంపీల అప్పీళ్లు పై కోర్టుల్లో ఉన్నంతవరకు పదవుల్లో కొనసాగేందుకు వీలు కల్పించిన ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8, సబ్ సెక్షన్ 4ను కొట్టేస్తూ సుప్రీం కోర్టు ఈ ఏడాది జూలై 10న తీర్పివ్వడం తెలిసిందే. 1990-91 మధ్య వీపీ సింగ్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన మసూద్.. త్రిపురకు కేంద్రం కోటా కింద బీహార్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కేటాయించిన ఎంబీబీఎస్ సీట్లను అక్రమంగా అనర్హులకు కట్టబెట్టారని సీబీఐ  అభియోగాలు మోపింది.
 
  మసూద్ 1989-91 మధ్య అప్పటి త్రిపుర రెసిడెంట్ కమిషనర్ గురుదయాళ్ సింగ్‌తో కుట్రపన్ని తన సమీప బంధువైన విద్యార్థితోపాటు ఇద్దరికి మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పించారని ఆరోపించింది. సీట్ల కేటాయింపుపై మొత్తం 11 కేసులు నమోదు చేసింది. వీటిలో మూడు కేసుల్లో మసూద్‌ను సీబీఐ కోర్టు జడ్జి జేపీఎస్ మాలిక్ అవినీతి నిరోధక చట్టం, ఐపీసీలోని 120బీ(నేరపూరిత కుట్ర), 420(మోసం), 468(ఫోర్జరీ) కింద దోషిగా తేల్చారు.

 

మరో ఫోర్జరీ కేసులో నిర్దోషిగా ప్రకటించారు. కాగా, మిగతా కేసుల్లో గురుదయాళ్‌ను, అప్పటి త్రిపుర సీఎం సుధీర్ రంజన్ మజుందార్ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అమల్‌కుమార్ రాయ్‌లను, అక్రమంగా సీట్లు పొందిన 9 మంది విద్యార్థులను కూడా కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ విద్యార్థుల్లో మసూద్ బంధువు కూడా ఉన్నాడు. కోర్టు మసూద్‌కు వచ్చే నెల 1న శిక్ష ఖరారు చేయనుంది. ఆయనకు గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. మసూద్ 90 రోజుల్లోగా తీర్పుపై అప్పీలు చేసుకోవచ్చు. కాగా, ఈ కేసుల్లో నిందితులైన సుధీర్ మజుందార్, నాటి త్రిపుర మంత్రి కాశీరామ్ రీంగ్ కేసు విచారణ కాలంలో చనిపోయారు.

మరిన్ని వార్తలు