ఎడారి నగరాలను మించిన ఎండ..

23 May, 2018 15:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వేసవి తాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతుండటంతో పాటు వడగాలులతో జనం ఇంటికే పరిమితమవుతున్నారు. జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌),ఉత్తరాదిలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ దాటాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇదే రోజు దుబాయ్‌, అబుదాబి, మస్కట్‌ వంటి ఎడారి నగరాల్లో ఉష్ణోగ్రత కంటే ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం. మంగళవారం ఢిల్లీలో రెండేళ్ల గరిష్టస్థాయిలో 44.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

ఇక దుబాయ్‌లో బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. రానున్న రోజుల్లో ఇక్కడ ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయని అంచనా కాగా. అబుదాబి, ఒమన్‌లలోనూ ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 41 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదవుతున్నాయి. ఇక రాజస్ధాన్‌లోని బికనీర్‌, జోథ్‌పూర్‌లో 44 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత, పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో 45 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఎడారి నగరాలను మించి భారత నగరాల్లో ఉష్ణోగ్రతలు నమోదవడం బెంబేలెత్తిస్తోంది. 

మరిన్ని వార్తలు