డేరా బాబాకు మరో ఎదురుదెబ్బ

11 Jan, 2019 16:40 IST|Sakshi

జర్నలిస్టు హత్య కేసులో డేరా బాబాను దోషిగా తేల్చిన ప్రత్యేక కోర్టు

సాక్షి, న్యూఢిల్లీ :  డేరా సచ్ఛా సౌధా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు మరో కేసులో జైలు శిక్షపడనుంది. జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసుపై పంచకుల ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. డేరాబాబాతో పాటు మరో ముగ్గురిని కోర్టు దోషిగా తేల్చింది. నలుగురు దోషులకు జనవరి 17న శిక్షలు ఖరారు చేయనుంది. ప్రస్తుతం ఆయన హర్యానాలోని రోహ్‌తక్‌ సునారియా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. సిర్సాలోని డేరా సచ్చా సౌద హెడ్ క్వార్టర్స్‌లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి వెలుగులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో 2002 అక్టోబరులో జర్నలిస్ట్ రామచంద్రను డేరాబాబా అనుచరులు దారుణంగా హత్యచేశారు. (జేజేల నుంచి.. జైలు దాకా...!)

ఇక ఇప్పటికే ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో డేరాబాబాకు 20 ఏళ్ల జైలు శిక్షపడిన విషయం తెలిసిందే. ఈ కేసులో తీర్పు వెలువరించాక జరిగిన అల్లర్లు, హింసాత్మక ఘటనల్లో  36 మంది చనిపోయారు. ఈ క్రమంలో మళ్లీ అలాంటి ఘటనలు జరగకుడా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. డేరాబాబా దోషిగా తేలిన నేపథ్యంలో పంచకుల ప్రత్యేక కోర్టు ఆవరణలో పోలీసులు భారీగా మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘాపెట్టారు. (రూ. 20 సంపాదిస్తున్న డేరా బాబా)

మరిన్ని వార్తలు