చివరి నిమిషంలో 18 విమానాలు రద్దు..

23 Dec, 2019 14:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : విమానాలు అందుబాటులో లేకపోవడం, కాక్‌పిట్‌ సిబ్బంది కొరతతో 18 దేశీయ విమానాలను గోఎయిర్‌ రద్దు చేసింది. గోఎయిర్‌కు చెందిన ఏ320 నియో విమానాల్లో ఇంజన్‌ సమస్యలతో ఆ విమానాలు కొన్ని అందుబాటులో లేవని ఎయిర్‌లైన్‌ వర్గాలు తెలిపాయి. ఈ సమస్యలతో పాటు కాక్‌పిట్‌ సిబ్బంది కొరతతో ముంబై, గోవా, బెంగళూర్‌, ఢిల్లీ, శ్రీనగర్‌, జమ్ము, పట్నా, ఇండోర్‌, కోల్‌కతా నుంచి బయలుదేరాల్సిన 18 విమానాలను సోమవారం గోఎయిర్‌ రద్దు చేసింది.

కాగా పౌరసత్వ సవరణ చట్టంపై సాగుతున్న ఆందోళనలతో పాటు నిర్వహణ సిబ్బంది అందుబాటులో ఏర్పడిన సమస్యల నేపథ్యంలో తమ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడిందని గోఎయిర్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రతికూల వాతావరణం, లో విజిబిలిటీ వంటి సమస్యలతో పాటు పౌర చట్టంపై దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు, విమాన సిబ్బంది హాజరులో పరిమితుల కారణంగా గోయిర్‌ నెట్‌వర్క్‌లోని పలు విమానాల సేవల్లో విఘాతం కలుగుతోందని సంస్థ ప్రతినిధి ప్రకటనలో వెల్లడించారు. చివరినిమిషంలో గోఎయిర్‌ విమానాలను రద్దు చేయడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు