గూడ్స్‌ రైలులో భారీ అగ్ని ప్రమాదం

9 Feb, 2017 19:45 IST|Sakshi

వేలూరు: తమిళనాడులోని కాట్పాడి సమీపంలో గూడ్స్‌ రైలులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చెన్నై తురై ముగం నుంచి సేలం మోటూరులోని థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుకు బొగ్గును సరఫరా చేసేందుకు ఈ గూడ్స్‌ రైలు బయలుదేరింది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కాట్పాడి సమీపంలోని సేవూరు వద్ద రైలు నుంచి మంటలు చెలరేగాయి. మొత్తం 13 బోగీలు కూడా మంటల్లో చిక్కుకున్నాయి.

అప్రమత్తమైన డ్రైవర్‌ రైలును నిలిపివేసి అధికారులకు సమాచారం అందజేశాడు. విషయం తెలుసుకున్న కాట్పాడి రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు. మంటలు వ్యాపించటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. సాయంత్రం 5 గంటల సమయానికి కూడా మంటలు అదుపులోకి రాలేదు. గూడ్స్‌ రైలులో మంటలకు కారణమేమిటనే విషయంపై అధికారులు విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు