కేజ్రీవాల్‌పై కుమార్‌కు విశ్వాసం పోయిందా?

16 Apr, 2017 18:10 IST|Sakshi
కేజ్రీవాల్‌పై కుమార్‌కు విశ్వాసం పోయిందా?

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీలో కీలక నేత కుమార్‌ విశ్వాస్‌కు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై విశ్వాసం పోయినట్లుందని సోషల్‌ మీడియాలో ధుమారం రేగుతోంది. కేజ్రీవాల్‌ను కుమార్‌ విశ్వాస్‌ పరోక్షంగా ప్రశ్నించారు. అవినీతి మరకలు అంటుకున్నవారిని కాపాడే ప్రయత్నం చేస్తే ప్రజలు ప్రశ్నిస్తారని అన్నారు. అవినీతిని అంతమొందిస్తామనే హామీతో ఢిల్లీలో అధికారం చేజిక్కించుకుని ఆ తర్వాత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని రక్షించే ప్రయత్నం చేస్తే ప్రజలు తప్పకుండా నిలదీస్తారని చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అంతేకాదు, పలువురు నాయకులపై విశ్వాస్‌ విమర్శనస్త్రాలు ఎక్కుపెట్టారు.

ముఖ్యమైన సమస్యలు అన్నింటిని పక్కకు పెట్టి భజన చేయించుకోవడం నాయకులకు అలవాటుగా మారిందని అన్నారు. వారంతా మోదీ, మోదీ, అరవింద్‌ అరవింద్‌ అంటుంటే ఆ భజనల్లో మునిగి తేలుతున్నారని చెప్పారు. ‘మోదీ, మోదీ, అరవింద్‌ అరవింద్‌, రాహుల్‌ రాహుల్‌, యోగి రాజా ఆగయా, ఏకే రాజ్‌ ఆగయా అనే భజనల్లో మనమంతా తీరిక లేకుండా ఉన్నాం’ అని నాయకులను విమర్శించారు. అలాగే, కశ్మీర్‌లో జవానులకు జరుగుతున్న అవమానాలను ప్రశ్నించారు. పలు నియామకాల్లో అవినీతికి పాల్పడిన వ్యక్తులకు చోటు కల్పిస్తున్నారని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. వీటిని ఉద్దేశించే తాజాగా విశ్వాస్‌ ఓ వీడియోలో పరోక్షంగా ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు