తండ్రిని మోసిన కుమారుడు.. విచారణకు ఆదేశం

16 Apr, 2020 08:54 IST|Sakshi

కొల్లాం(కేరళ) : ఆరోగ్యం బాగాలేని తండ్రిని, కుమారుడు ఎత్తుకుని కిలోమీటరు మేర నడిచిన ఘటనపై కేరళ మానవహక్కుల కమిషన్‌ విచారణకు ఆదేశించింది. కొల్లాం జిల్లాలోని పునలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తన తండ్రి జార్జ్‌(89)ని తీసుకురావడానికి వెళుతుండగా లాక్‌డౌన్‌ కారణంగా పునలూర్‌లో పోలీసులు రోయ్‌మన్‌(30)‌ ఆటోను అడ్డుకున్నారు. ఆసుపత్రికి వెళ్లి తన తండ్రిని తీసుకురావాలని మొరపెట్టుకున్నా వినిపించుకోకపోవడంతో చేసేదేమీ లేక ఒక కిలోమీటరు నడుచుకుంటూ ఆసుపత్రికి వెళ్లాడు. తిరిగి తన తండ్రిని తీసుకురావడానికి వేరే అవకాశం లేకపోవడంతో ఎత్తుకుని ఆటో వరకు తీసుకువచ్చాడు. తండ్రిని ఎత్తుకుని తిరిగి వస్తున్న రోయ్‌మన్‌ని చూసి కనీసం అక్కడున్నపోలీసులు స్పందించలేదు.

పులనూరు సీఐ ముందుగా తనను ఆటో డాక్యుమెంట్లు అడగ్గా అన్ని చూపించానని రోయ్‌మన్‌ తెలిపారు. అయినా ఆటోను ఆసుపత్రి వరకు అనుమతించలేదన్నారు. అయితే పోలీసులు మాత్రం ఆసుపత్రికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు చూపించకపోవడంతో అనుమతి నిరాకరించామని చెబుతున్నారు. ఇక జిల్లా ఎస్‌పీ నుంచి ఈ ఘటనపై రిపోర్టు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని కేరళ మానవ హక్కుల సంఘం తెలిపింది.

మరిన్ని వార్తలు