భార్యపైనే గ్యాంగ్‌రేప్ చేయించాడు!

27 May, 2017 20:35 IST|Sakshi
భార్యపైనే గ్యాంగ్‌రేప్ చేయించాడు!

భార్యతో తలెత్తిన విభేదాల నేపథ్యంలో కక్ష తీర్చుకునేందుకు ఓ భర్త నీచానికి పాల్పడ్డాడు. దగ్గరుండి మరీ తన అన్నలతో ఆమెపై సామూహిక అత్యాచారం చేయించాడు. గుజరాత్‌ రాష్ట్రం దహోద్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గడోయి గ్రామానికి చెందిన యువతి(19)కి సమీపంలోని అభ్లోద్‌ గ్రామానికి చెందిన వ్యక్తితో (20) గత ఏడాది వివాహమైంది. అయితే, భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె ఈనెల 20వ తేదీన పుట్టింటికి వెళ్లిపోయింది. సామరస్యంగా ఉందామంటూ భర్త ఆమె వద్దకు వెళ్లి 24వ తేదీన తిరిగి తన ఇంటికి తీసుకువచ్చి ఓ గదిలో బంధించాడు. ఇది తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తమ కుమార్తెను భర్త కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లాడని, ఆమె జాడ కనిపెట్టాలని కోరారు. ఈలోపు భర్త తన ముగ్గురు సోదరులతో మంతనాలు జరిపాడు. ఆమెతో తెగదెంపులు చేసుకోవాలంటే ఏం చేయాలో నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అతని ముగ్గురు అన్నలు ఆమెపై అత్యాచారానికి పాల్పడి పుట్టింటికి వెళ్లిపోవాలని బెదిరించారు. అనంతరం బాధితురాలు ఈ ఘోరంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు నిందితుడిని, అతడి ఒక అన్నను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. భర్తపై కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు