చైనీస్‌ జెట్‌ ఫైటర్లకు చెక్‌..

21 May, 2018 14:07 IST|Sakshi
సుఖోయ్‌ యుద్ధ విమానం (ఫైల్‌ ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ : సుఖోయ్‌ 30ఎమ్‌కేఐను ఈశాన్య భారత్‌లో కేంద్రీకరించడం ద్వారా.. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఎయిర్‌ ఫోర్స్‌ ఎత్తుగడలను నిలువరించవచ్చని భారత రక్షణ పరిశోధన విభాగం తెలిపింది. ఇందుకోసం భారత వాయుసేన సుఖోయ్‌ సూ- 30ఎమ్‌కేఐ రాడార్‌ను వినియోగించనుంది. తద్వారా చైనాకు చెందిన చెంగ్డూ జే- 20 ఫైటర్ల కదలికలను గమనించడం ద్వారా ప్రమాదాలను ముందే అరికట్టవచ్చని భావిస్తోంది. రష్యా సాంకేతిక సాయంతో సుఖోయ్‌ 30ఎమ్‌కేఐను నవీనీకరించడం ద్వారా ఒకేసారి 30 లక్ష్యాలను ఛేదించేందుకు వీలుగా  సుఖోయ్‌ సూ- 30ఎమ్‌కేఐను తీర్చిదిద్దనుంది.  

భారత వాయుసేనాధిపతి బీరేందర్‌ సింగ్‌ ధనోవా మాట్లాడుతూ.. సుఖోయ్‌ సూ- 30ఎమ్‌కేఐ కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సునాయాసంగా ఛేదించగలదని పేర్కొన్నారు. తద్వారా జే 20 ఫైటర్ల కదలికలను గమనించవచ్చని తెలిపారు. ఎమ్‌కేఐని నవీనీకరించడం ద్వారా భారత వాయు వ్యవస్థ మరింత బలోపేతం అయిందని తెలిపారు. గతంలో చైనాకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు అత్యధిక ఎత్తులో ప్రయాణించడం వల్ల లక్ష్యాలను ఛేదించడం కష్టతరమయ్యేదని.. కానీ ప్రస్తుతం ఆ సమస్యని అధిగమించామని వ్యాఖ్యానించారు.

గగన్‌ శక్తి 2018 ఎవరికీ వ్యతిరేకం కాదు..
13 రోజుల పాటు నిర్వహించిన గగన్‌ శక్తి- 2018 ప్రత్యేకంగా ఏ దేశాన్ని ఉద్దేశించింది కాదని ధనోవా స్పష్టం చేశారు. ఈ ఏడాది అనుకున్న దాని కన్నా ఎక్కువ లక్ష్యాలను సాధించామని ఆయన తెలిపారు. గగన్‌ శక్తి వార్‌గేమ్‌లో భాగంగా హిందుస్థాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెట్‌ స్వదేశీ పరిఙ్ఞానంతో కొత్తగా రూపొందించిన తేజస్‌ సూపర్‌సోనిక్‌ ఫైటర్‌ జెట్‌ను కూడా పరీక్షించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు