ఆర్టికల్‌ 370 ఎఫెక్ట్‌ : సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌కు బ్రేక్‌

11 Aug, 2019 20:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో ఢిల్లీ నుంచి పాకిస్తాన్‌లోని అటారి వరకూ నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను భారత్‌ రద్దు చేసింది. ఈ ఎక్స్‌ప్రెస్‌ను పాకిస్తాన్‌ ఈనెల 8న రద్దు చేసిన క్రమంలో భారత్‌ ఆదివారం​ ఈ నిర్ణయం తీసుకుంది. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేస్తూ పాకిస్తాన్‌ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఢిల్లీ-అటారి మధ్య నడిచే ఈ రైలును రద్దు చేయాలని నిర్ణయించినట్టు ఉత్తర రైల్వే సీపీఆర్వో ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇరు దేశాల మధ్య రైలు సర్వీసుల రద్దు నేపథ్యంలో లాహోర్‌-ఢిల్లీ ఫ్రెండ్‌షిప్‌ బస్‌ సర్వీస్‌ను సైతం పాకిస్తాన్‌ నిలిపివేసింది. ఇరు దేశాల మధ్య సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేస్తున్నట్టు పాక్‌ రైల్వే మంత్రి రషీద్‌ అహ్మద్‌ ఇటీవల ప్రకటించగా లాహోర్‌-న్యూఢిల్లీ మధ్య దోస్తీ బస్‌ సర్వీస్‌ను ప్రభుత్వం రద్దు చేసిందని పాక్‌ కమ్యూనికేషన్ల మంత్రి మురాద్‌ సయీద్‌ వెల్లడించారు. ఆర్టికల్‌ 370 రద్దుకు నిరసనగా భారత్‌తో దౌత్య, వాణిజ్య సంబంధాలు తెగతెంపులు చేసుకున్నట్టు పాకిస్తాన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌ నిర్ణయంతో ఆ దేశమే దెబ్బతింటుందని తమ ప్రయోజనాలపై ఇది ఎలాంటి ప్రభావం చూపదని భారత్‌ స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు