‘ముందు ఉగ్రమూకను ఖాళీ చేయించండి’

17 Feb, 2020 08:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్‌పై ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెర్స్‌ చేసిన ప్రతిపాదనను భారత్‌ తోసిపుచ్చింది. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి సుముఖంగా లేమని, పొరుగుదేశం బలవంతంగా, అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాల నుంచి ఖాళీ చేసేలా ఐరాస దృష్టిసారించాలని కోరింది. కాగా జమ్ము కశ్మీర్‌లో పరిణామాలపై తాను తీవ్రంగా కలత చెందానని, ఇరు దేశాలు అంగీకరిస్తే కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమని ఐరాస చీఫ్‌ గుటెర్స్‌ పాక్‌ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై భారత్‌ ఈ మేరకు స్పందించింది.

మరోవైపు జమ్ముకశ్మీర్‌పై తమ విధానంలో ఎలాంటి మార్పూ లేదని, కశ్మీర్‌ భారత్‌ అంతర్భాగమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఈ అంశంలో ద్వైపాక్షిక సంప్రదింపులు మినహా మరెవరి జోక్యానికీ తావు లేదని తేల్చిచెప్పారు. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌ ప్రోత్సహిస్తున్న సీమాంతర ఉగ్రవాదం నిర్మూలించే దిశగా ఐరాస దృష్టిసారించాలని కోరారు.

చదవండి : ఐరాసలో పాక్‌కు మళ్లీ భంగపాటు

మరిన్ని వార్తలు