కశ్మీర్‌పై పటేల్‌ జోక్యం లేదు: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌

27 Jun, 2018 12:20 IST|Sakshi
జితేందర్‌ సింగ్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి​, న్యూఢిల్లీ : కశ్మీర్‌ అంశంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సైఫుద్దీన్ సోజ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి (అంతరిక్ష వ్యవహారాల శాఖ ఇన్‌ఛార్జి) జితేంద్ర సింగ్‌ స్పందించారు. కశ్మీర్‌కు బదులుగా హైదరాబాద్‌ను పాకిస్తాన్‌కు ఇచ్చేందుకు తొలి హోంమంత్రి సర్ధార్ వల్లబాయ్ పటేల్ పాక్‌కు ఆఫర్‌ చేశారని సైఫుద్దీన్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన జితేంద్ర సింగ్‌.. కశ్మీర్‌ విషయంలో పటేల్‌ జోక్యం చేసుకుని ఉంటే ఈ రోజు భారతదేశ చర్రిత మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు. కశ్మీర్‌పై పటేల్‌ జోక్యం చేసుకోకుండా ఆనాటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ నియంత్రించారని, లేకపోతే  కశ్మీర్‌ సమస్యకు అప్పడే శాస్వత పరిష్కారం ఏర్పడేదని పేర్కొన్నారు.

హోంమంత్రి స్థానంలో  ఉన్నా పటేల్‌ను ప్రధాని నెహ్రూ నిలువరించారని, కశ్మీర్‌పై నెహ్రూ సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్లనే కశ్మీర్‌ సమస్య ఏర్పడిందని తెలిపారు. పటేల్‌ చర్యల కారణంగానే హైదరాబాద్‌ సంస్థానం విలీనం జరిగిందని, కశ్మీర్‌ సమస్య కూడా ఆనాడే ముగిసిపోయి ఉండేదని అన్నారు. ప్రస్తుత కశ్మీర్‌లో పాకిస్తాన్‌ భాగంగా ఉందని అది చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు