బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవం

20 Jan, 2020 14:49 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడిగా జగత్‌ ప్రకాశ్‌ నడ్డా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నడ్డాకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. జేపీ నడ్డా పార్టీ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు బీజేపీ సంస్థాగత ఎన్నికల ఇన్‌చార్జ్‌ రాధామోహన్‌సింగ్‌ నియామకపత్రాన్ని అందించారు. ఇక ఈరోజు సాయంత్రం 4 గంటలకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రలతో నూతన అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం కానున్నారు. నడ్డా ప్రస్తుతం బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. గత మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నడ్డా వ్యవహరించారు.
(చదవండి : తర్వాత ఎన్నార్సీయే : జేపీ నడ్డా)


ఒక వ్యక్తికి ఒకే పదవి..
బీజేపీ అధ్యక్షుడిగా ఐదున్నరేళ్లకు పైగా పనిచేసిన అమిత్‌ పార్టీని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. అమిత్‌ షా హయంలోనే బీజేపీ కేంద్రంలో రెండు సార్లు, పలు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వచ్చింది. మోదీ తాజా ప్రభుత్వంలో అమిత్‌ షాకు కీలకమైన హోంమంత్రి పదవి దక్కింది. దీంతో ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అనే సంప్రదాయం ప్రకారం పార్టీ అధ్యక్ష పదవి కోసం మరొకరిని ఎన్నుకోవడం అనివార్యమైంది. విద్యార్థి దశ నుంచే జేపీ నడ్డా పార్టీ కోసం పనిచేశారు. కీలక పదవులను సమర్ధవంతంగా నిర్వహించిన తీరు, ఆరెస్సెస్‌తో అనుబంధం, వివాద రహితుడిగా ఉన్న పేరు.. మొదలైనవి జేపీ నడ్డాకు అనుకూలంగా మారాయి. 
(చదవండి : 'రాహుల్‌.. దమ్ముంటే సీఏఏపై 10 వాక్యాలు మాట్లాడు')

మరిన్ని వార్తలు