కరుణానిధికి ఇన్ఫెక్షన్, జ్వరం

27 Jul, 2018 04:58 IST|Sakshi
కరుణానిధిని పరామర్శించేందుకు వచ్చిన నేతలు

సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కరుణానిధి(94) మూత్రనాళ ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్నారు. గురువారం రాత్రి 7.30 గంటల నుంచి ప్రత్యేక వైద్య బృందం కరుణానిధి ఇంటిలోనే ఉండి చికిత్స అందిస్తోంది. వయో భారం, అనారోగ్య సమస్యలతో రెండేళ్లుగా కరుణానిధి గోపాలపురంలోని ఇంటికే పరిమితమయ్యారు. రెండు నెలల క్రితం కరుణ ఆరోగ్యం కుదుటపడిందని, త్వరలో ప్రజాసేవకు అంకితమవుతారని డీఎంకే కార్యాలయం ప్రకటించింది.

డీఎంకే అధినేతగా పగ్గాలు చేపట్టి 50వ వసంతంలోకి అడుగు పెడుతుండడంతో శుక్రవారం స్వర్ణోత్సవ కార్యక్రమాలకు డీఎంకే వర్గాలు సిద్ధమయ్యాయి. ఈ పరిస్థితుల్లో బుధవారం కరుణ ఆరోగ్యం క్షీణించడం గమనార్హం. కాగా,  డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ను కలసి కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మక్కల్‌ నీది మయ్యమ్‌ అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ కరుణానిధిని చూసి వెళ్లారు.
 

మరిన్ని వార్తలు