‘సాక్షి’ వ్యాసానికి లాడ్లీ మీడియా అవార్డు

15 Sep, 2018 01:29 IST|Sakshi
శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకుంటున్న కేఎన్‌ మల్లీశ్వరీ. చిత్రంలో ప్రముఖ జర్నలిస్టు సాయినాథ్‌ తదితరులు

వాకపల్లి బాధితులకు న్యాయం కోసం కేఎన్‌ మల్లీశ్వరీ ప్రత్యేక వ్యాసం

సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ జిల్లా వాకపల్లి అత్యాచార బాధితులకు న్యాయం జరగాలంటూ 2017లో ‘సాక్షి’లో ప్రచురితమైన ‘భూమి చెప్పినా ఆకాశం నమ్మక పదేళ్లు’వ్యాసానికి లాడ్లీ మీడియా అవార్డు దక్కింది. ప్రముఖ వ్యాసకర్త కేఎన్‌ మల్లీశ్వరీ గతేడాది సెప్టెంబర్‌లో రాసిన ఈ వ్యాసాన్ని లాడ్లీ మీడియా సంస్థ గుర్తించి జాతీయ స్థాయి దృష్టికి తీసుకొచ్చింది. మత్స్యకార మహిళల గురించి, గోదావరి ఆక్వా పరిశ్రమను వ్యతిరేకిస్తూ మహిళలు చేసిన పోరాటాలపై, వ్యాపార రంగాల్లో మహిళల మీద వివక్ష, పోలవరం నిర్వాసితుల సమస్య, స్త్రీల గురించి అంబేడ్కర్‌ చెప్పిన అంశాలు సహా పలు సామాజిక అంశాలపై ఆమె గత మూడేళ్లుగా ‘సాక్షి’లో ప్రత్యేక వ్యాసాలు రాస్తున్నారు.

శుక్రవారం ఢిల్లీలో జరిగిన సంస్థ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్టు పి.సాయినాథ్‌ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వాకపల్లి అత్యాచార బాధితులకు న్యాయం జరగడంలో జాప్యం జరుగుతోందని, వారిలో ఇప్పటికే ముగ్గురు చనిపోయారని పేర్కొన్నారు. కనీసం ఇప్పటికైనా బాధితులకు న్యాయం జరగడంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు