‘సిట్‌ ఆయనను రక్షించే ప్రయత్నం చేస్తోంది!’

18 Sep, 2019 15:12 IST|Sakshi

లక్నో: తనపై లైంగికదాడి చేసిన బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌పై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్‌) కేసు నమోదు చేయకుండా ఎందుకు జాప్యం చేస్తోందని బాధిత న్యాయ విద్యార్థిని ప్రశ్నించింది. కాగా సెక్షన్ 164 కింద తన వాంగ్మూలాన్ని15రోజుల నుంచి దర్యాప్తు చేస్తున్నప్పటికి చిన్మయానంద్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని ఆమె సిట్‌పై మండిపడింది. సిట్‌ బృందం నిందితుడిని రక్షించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోందని ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా ఆధారాలు చూపించి కేసును తప్పుదోవ పట్టించాలని సిట్‌ చూస్తోందన్నారు. కేసు దర్యాప్తు పురోగతిపై నిరాశ వ్యక్తం చేస్తూ.. నిందితుడిపై చర్యలు ప్రారంభించడానికి తన జీవితాన్ని ముగిసే వరకు సంబంధిత అధికారులు ఎదురుచూస్తున్నారా? అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

‘నేను ఆత్మహత్య చేసుకుంటానంటే అధికారులు నమ్ముతారా? ప్రభుత్వం నా జీవితాన్ని ముగించే వరకు నిందితుడిపై చర్యలు తీసుకోదా? ఢిల్లీ మెజిస్ట్రేట్‌కు అత్యాచారంపై ఫిర్యాదు చేశాను. పోలీసులకు చిన్మయానంద్‌ గదిలో ఉన్న మద్యం సీసాల సమాచారం అందించాను. కేసుకు సంబంధించిన ఓ పెన్‌డ్రైవ్‌ను సిట్‌కు అప్పగించాను. కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను పోలీసులకు అందజేశాను. కానీ ఇప్పటివరకు కేసులో పురోగతి లేదు. సిట్‌ పూర్తిగా చిన్మయానంద్‌కు సహకరిస్తోందని నా అనుమానం. నాకు న్యాయం జరిగే వరకు పోరాడతా‘ అని బాధితురాలు పేర్కొన్నారు. అయితే చిన్మయానంద్‌ అస్వస్థతకు లోనుకావడంతో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా సిట్‌ బృందం దర్యాప్తులో భాగంగా పలు ఆధారాల సేకరణ కోసం బాధిత విద్యార్థిని శుక్రవారం చిన్మయానంద్‌ గదికి తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు