ఆ 20 మంది అడ్మిషన్లకు లక్నో వర్సిటీ నో..

4 Jul, 2018 16:40 IST|Sakshi

లక్నో : యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ గత ఏడాది లక్నో యూనివర్సిటీ క్యాంపస్‌ను సందర్శించినప్పుడు నిరసన తెలిపిన విద్యార్ధులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గతంలో సీఎం రాకను వ్యతిరేకిస్తూ నల్లజెండాలతో నిరసన తెలిపిన 20 మంది విద్యార్థులకు లక్నో యూనివర్సిటీ అడ్మిషన్లను నిరాకరించింది. వర్సిటీలోని పీజీ కోర్సుల్లో తమకు ప్రవేశాలు కల్పించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం నుంచి లక్నో వర్సిటీకి చెందిన విద్యార్థి సంఘం నేతలు పూజా శుక్లా, గౌరవ్‌ త్రిపాఠిల నేతృత్వంలో బాధిత విద్యార్థులు నిరాహారదీక్షకు దిగారు.

యోగి ఆదిత్యానాథ్‌ ప్రభుత్వ ఆదేశాల మేరకే వర్సిటీ అధికారులు తమను వేధింపులకు గురిచేస్తున్నారని విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు అడ్మిషన్లు ఇచ్చేవరకూ ఆమరణ దీక్ష చేస్తామని హెచ్చరంచారు.

గత ఏడాది సీఎం యోగి ఆదిత్యానాథ్‌ క్యాంపస్‌ను సందర్శించిన సమయంలో నిరసనలకు దిగిన ఘటనకు సంబంధించి పోలీసులు 11 మంది విద్యార్థులను అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది విద్యార్థులను యూనివర్సిటీ అధికారులు బహిష్కరించారు.

మరిన్ని వార్తలు