ఏటీఎం మోసాలు అక్కడే ఎక్కువ

23 Jul, 2019 08:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏటీఎం మోసాలలో దేశంలో ఢిల్లీ రెండవ స్థానంలో నిలిచింది. 2018–19లో నగరంలో లక్ష లేదా అంతకన్నా ఎక్కువ రూపాయలు గల్లంతైన ఏటీఎం మోసాల కేసులు 179 నమోదయ్యాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆ‹ఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) డేటా తెలిపింది. నగరవాసులు ఈ మోసాలలో రూ.2.9 కోట్లు పోగొట్టుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 233 ఏటీఎం మోసాల కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర వాసులు ఏటీఎం మోసాలల్లో రూ.4.81 కోట్లు, తమిళనాడు వాసులు రూ.3.63 కోట్లు పోగొట్టుకున్నారు. 2017–18తో పోలిస్తే నగరంలో 2018–19లో ఏటీఎం మోసాలు పెరిగాయి. 2017–18లో 132 కేసులు జరిగాయి. ఈ మోసాల్లో రూ.2.8 కోట్లు గల్లంతయ్యాయి. ఢిల్లీలోనే కాక దేశం మొత్తం మీద కూడా ఏటీఎం మోసాలు 911 నుంచి 980 కి పెరిగాయి. అసోం, త్రిపుర, అరుణాచల్‌ ప్రదేశ్‌ మినహా అన్ని రాష్ట్రాల్లో ఏటీఎం మోసాల కేసులు నమోదయ్యాయి. ఈ మోసాల్లో ఢిల్లీలో గల్లంతైన డబ్బు 2017–18 లో ఉన్న రూ.65.3 కోట్ల నుంచి 2018–19లో రూ.21.4 కోట్లకు తగ్గింది.

లక్ష రూపాయలకు పైగా గల్లంతైన కేసులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం వల్ల దేశంలో జరుగుతోన్న ఏటీఎం మోసాలన్నీ డేటాలో వెల్లడి కాలేదని సైబర్‌ నిపుణులు అంటున్నారు. ఈ కేసుల సంఖ్య చాలా ఎక్కువగా, గల్లంతైన సొమ్ము భారీ మొత్తంలో ఉంటుందని వారు అంటున్నారు. మోసగాళ్లు అనేక పద్ధతుల ద్వారా ఏటీఎంల ద్వారా వినియోదారుల బ్యాంకు ఖాతాలను దోచుకోవడానికి పథకాలు వేస్తున్నారని నిపుణులు చెప్పారు. సాధారణంగా మోసగాళ్లు ఏటీఎంలు లేదా పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ మిషన్లలో స్కిమ్మర్లను అమర్చి కార్డుల నుంచి డేటాను చోరీ చేస్తారని ఆ తరువాత ఈ డేటాను ఖాళీ కార్డులపై ఉంచి అక్రమ లావాదేవీలు జరుపుతారని వారు చెప్పారు. భద్రత సరిగ్గా లేని ఏటీఎంలను దోచుకునే అనేక మూఠాలను ఢిల్లీ పోలీసులు గుర్తించారు. అమాయకంగా కనబడే వినియోగదారులకు సహాయం చేస్తామన్న మిషతో కార్డులు మార్చి ఆ తరువాత ఏటీఎంల నుంచి వినియోగదారుల ఖాతాలను ఖాళీ చేస్తారని చెప్పారు.

నకిలీ వెబ్‌సైట్‌లతో తస్మాత్‌ జాగ్రత్త..
ఆన్‌లైన్‌ మోసాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని బ్యాంకుల కస్టమర్‌ కేర్‌ ఏజెంట్లమని చెప్పి మోసగాళ్లు వినియోగదారుల నుంచి గోపనీయమైన సమాచారాన్ని సేకరించి మోసగిస్తుంటారు. కొందరు మరో అడుగుముందుకేసి బ్యాంకుల నకిలీ వెబ్‌సైట్లను కూడా తెరిచారు. వినియోగదారులు ఇంటర్నెట్‌ గాలించి ఈ వెబ్‌సైట్లలో పేర్కొన్న బూటకపు కస్టమర్‌ కేçర్‌ నంబర్లను సంప్రదించినప్పుడు వారిని మోసగిస్తుంటారు. నేరగాళ్లు రోజురోజుకు ఆధునిక టెక్నాలజీలను ఉపయోగిస్తూ కొత్త కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతుండగా, ఢిల్లీ పోలీసు సైబర్‌ క్రైమ్‌ ప్రివన్షెన్‌ అవేర్‌నెస్‌ అండ్‌ డిటెక్షన్‌ సెంటర్‌ సుక్షితులైన సిబ్బంది కొరత వంటి అనేక సమస్యలతో సతమతమవుతంది. ఈ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పోలీస్‌ శాఖ కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది.

మరిన్ని వార్తలు