‘యోగిజీ..ముందు యూపీని చక్కదిద్దండి’

5 Feb, 2019 15:41 IST|Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో పార్టీ ప్రచార ర్యాలీలో పాల్గొనేందుకు సంసిద్ధమైన యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌పై బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. ఇతర రాష్ట్రాలపై వ్యాఖ్యలు చేసే ముందు ఆయన తన రాష్ట్రాన్ని చక్కదిద్దుకోవాలని ఆమె హితవు పలికారు. రాష్ట్రంలో యోగి హెలికాఫ్టర్‌ ల్యాండయ్యేందుకు అనుమతి నిరాకరించడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ముందుగా యూపీపై దృష్టిపెట్టమని యోగిని కోరండంటూ మండిపడ్డారు.

‘యూపీలో ఎంతో మంది అమాయకులను చంపేశారు, పోలీసులనూ హత్య చేశారు. ఎంతో మందిని ఊచకోత కోశారు. సొంత రాష్ట్రంలో ముఖం చెల్లని యోగి బెంగాల్‌ చుట్టూ తిరుగుతున్నా’రని ఆమె ధ్వజమెత్తారు. మరోవైపు యోగి ఆదిత్యానాథ్‌ ర్యాలీలకు బెంగాల్‌ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో మంగళవారం ఆయన టెలిఫోన్‌ ద్వారానే ఆయా వేదికల వద్ద పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. కాగా కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ నివాసంపై సీబీఐ బృందం దాడులు చేపట్టడాన్ని నిరసిస్తూ ఆమె తన దీక్షను కొనసాగిస్తున్నారు.

మరిన్ని వార్తలు