ముంబై: ముంబైకి చెందిన ఓ దినపత్రిక ప్రచురించిన కార్టూన్ వివాదానికి దారి తీసింది. 'ఐఎస్ఐఎస్ మనీ' , ఉగ్రవాద సంస్థకు చేరుతున్న మనీ అనే అంశంపై కథనాన్ని, నిందాత్మకమైన కార్టూన్ను ప్రచురించిన స్థానిక దినపత్రిక 'లోక్మత్' పై ఆందోళనకారులు సోమవారం దాడికి దిగారు. రాష్ట్రంలోని పలుచోట్ల ఆ పత్రిక కాపీలను తగులబెట్టారు. ఈ నేపథ్యంలో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. పత్రికా కార్యాలయం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఐస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు నిధులు ఎలా వస్తున్నాయో చిత్రించిన కార్టూన్ పై ఆగ్రహించిన సమాజ్ వాదీ పార్టీ మైనార్టీ సెల్ కార్యకర్తలు వందల సంఖ్యలో లోక్మత్ పత్రికా కార్యాలయాల ముందు అందోళనకు దిగారు. ఇస్లాంను అవమానించారంటూ ఆరోపిస్తూ మాలేగావ్, ధూలే తదితర ఏరియాలోని ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పత్రిక ప్రతులను తగులబెడుతూ నినాదాలతో హోరెత్తించారు.
ఆందోళన కారుల నిరసనలతో ఉద్రిక్తత చెలరేగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, శాంతిభద్రతలను కాపాడటంలో సహకరించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆందోళన కారులు ఫిర్యాదుపై ఆ పత్రికకు చెందిన కార్టూనిస్ట్, ఎడిటర్పై కేసులు నమోదు చేశారు. కాగా ఆ అనుచిత కార్టూన్ ప్రచురించడంపై పత్రిక యాజమాన్యం, ఎడిటర్ బేషరతుగా క్షమాపణలు తెలిపారు.